న్యూఢిల్లీ, మార్చి 25: పెరుగుతున్న చమురు, ఇతర కమోడిటీల ధరలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల పట్ల ఆందోళనతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో స్టాక్ మార్కెట్ వరుసగా మూడో రోజూ క్షీణించింది. బీఎస్ఈ సెన్సెక్స్ 233 పాయింట్ల తగ్గుదలతో 57,362 పాయింట్ల వద్ద ముగియగా, నిఫ్టీ 70 పాయింట్లు క్షీణించి 17,153 పాయింట్ల వద్ద నిలిచింది. గత వారంతో పోలిస్తే సెన్సెక్స్ 501 పాయింట్లు, నిఫ్టీ 134 పాయింట్ల చొప్పున తగ్గాయి. వరుసగా రెండు వారాలపాటు భారీగా లాభపడ్డ మార్కెట్ ఈ వారంలో మాత్రం నష్టాలతో ముగిసింది. తాజాగా ఎఫ్ఎంసీజీ, బ్యాంకింగ్, ఐటీ షేర్లలో లాభాల స్వీకరణ జరిగినట్టు ట్రేడర్లు తెలిపారు. ఇటీవల 10 శాతం ర్యాలీ జరిపిన తర్వాత మార్కెట్ స్వల్పశ్రేణిలో ఒడిదుడుకులకు లోనవుతున్నదని, కమోడిటీ ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణ ఒత్తిడులు, కఠినంగా మారుతున్న ద్రవ్య విధానాలు ఇందుకు కారణమని బ్రోకరేజ్ సంస్థ జూలియస్ బేర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మిలింద్ వివరించారు. యుద్ద పరిణామాలు, కమోడిటీ ధరలపై భవిష్యత్ ట్రెండ్ ఆధారపడి ఉంటుందని జియోజిత్ ఫైనాన్షియల్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు.
సెన్సెక్స్-30 షేర్లలో అన్నింటికంటే అధికంగా టైటాన్ 3.6 శాతం తగ్గింది. టెక్ మహీంద్రా 2.35 శాతం, మారుతి సుజుకి 1.79 శాతం, విప్రో 1.18 శాతం మేర క్షీణించాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టీసీఎస్, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంక్, నెస్లే ఇండియా, లార్సన్ అండ్ టూబ్రో, హెచ్సీఎల్ టెక్, టాటా స్టీల్, ఐటీసీలు సైతం నేలచూపులు చూశాయి. మరోవైపు డాక్టర్ రెడ్డీస్ వరుస అప్ట్రెండ్ను కొనసాగించి, మరో 0.77 శాతం లాభపడింది. ఆసియన్ పెయింట్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్, భారతి ఎయిర్టెల్, ఎస్బీఐ, కొటక్ బ్యాంక్లు స్వల్ప లాభాలతో ముగిసాయి. రంగాల వారీగా చూస్తే కన్జూమర్ డ్యూరబుల్స్ ఇండెక్స్ 2.28 శాతం తగ్గింది. క్యాపిటల్ గూడ్స్, ఎఫ్ఎంసీజీ, ఐటీ సూచీలు 0.95 శాతం వరకూ క్షీణించాయి.
కొద్ది రోజులుగా స్వల్ప కొనుగోళ్లు జరిపిన విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐలు) తిరిగి అమ్మకాలకు తెరతీశారు. ఈ శుక్రవారం రూ.1,507 కోట్ల షేర్లను నికరంగా విక్రయించినట్టు ఎక్సేంజీల ప్రాధమిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గురువారం వారు రూ. 1,740 కోట్లు మార్కెట్ నుంచి వెనక్కు తీసుకున్నారు.