ముంబై, ఫిబ్రవరి 21: దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస ర్యాలీకి బ్రేక్పడింది. మదుపరులు ప్రాఫిట్ బుకింగ్కు మొగ్గుచూపడం, అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవడం కూడా పతనానికి ఆజ్యంపోశాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలతో చివరి గంటలో మదుపరులు అమ్మకాలకు మొగ్గుచూపారు. ఫలితంగా వరుసగా ఆరు రోజులుగా పెరుగుతూ వచ్చిన సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి.
లాభాల్లో ప్రారంభమైన సూచీలు సమయం గడుస్తున్న కొద్ది నష్టాల్లోకి జారుకున్నాయి. ఒక దశలో 73 వేల పైన కదలాడిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ ఇంట్రాడేలో 72,450 పాయింట్లకు జారిపోయింది. చివరకు 434.31 పాయింట్లు నష్టపోయి 72,623.09 వద్ద ముగిసింది. రికార్డు స్థాయిలో దూసుకుపోయిన నిఫ్టీ వెనక్కి తగ్గింది. ఇంట్రాడేలో మరో చారిత్రక గరిష్ఠ స్థాయిని తాకిన నిఫ్టీ చివరకు 141.90 పాయింట్లు నష్టపోయి 22,055 పాయింట్ల వద్ద ముగిసింది.
సూచీలు దిద్దుబాటులో ఉన్నాయి. గత కొన్ని రోజులుగా ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన సూచీలు ప్రస్తుతం వెనక్కితగ్గుతున్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వు మినిట్స్ కోసం గ్లోబల్ మార్కెట్లు వేచి చూస్తున్నాయి. జనవరి నెలలో అమెరికా ద్రవ్యోల్బణం గరిష్ఠ స్థాయికి చేరుకోవడంతో త్వరలో ఫెడ్ వడ్డీరేట్లను తగ్గించే అవకాశాలున్నాయని పెట్టుబడిదారులు భావిస్తున్నారు.
– వినోద్ నాయర్, జియోజిట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసర్చ్ హెడ్