లక్నో: దోచుకున్న డబ్బు పెద్ద మొత్తంలో ఉండటం చూసి దొంగకు ఆనందం పట్టలేక గుండెపోటు వచ్చింది. దీంతో వైద్యం కోసం దోచుకున్న మొత్తం నుంచి భారీగా ఖర్చు చేయాల్సి వచ్చింది. ఈ వింత ఘటన ఉత్తరప్రదేశ్లోని బిజ్నోర్ జిల్లాలో జరిగింది. కొత్వాలి దేహ్త్ ప్రాంతంలోని ప్రజా సేవ కేంద్రంలో ఫిబ్రవరి 16 అర్ధరాత్రి తర్వాత ఇద్దరు దొంగలు చొరబడి దోచుకున్నారు. దీంతో ఆ కేంద్రం నిర్వాహకుడు నవాబ్ హైదర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దొంగలు ఏడు లక్షల నగదు చోరీ చేసినట్లు చెప్పాడు.
దర్యాప్తు జరిపిన పోలీసులు నాగినా పోలీస్ స్టేషన్ పరిధిలోని అలీపూర్ ప్రాంతంలో బుధవారం ఈ చోరీకి సంబంధించి నౌషాద్, ఎజాజ్ అనే ఇద్దరిని అరెస్ట్ చేశారు. వారిని చోరీ గురించి ప్రశ్నించగా ఒక విషయం బయటపడింది. ఊహించినదానికన్నా పెద్ద మొత్తంలో దోచిన డబ్బును చూసి ఒక దొంగకు సంతోషం పట్టలేక గుండెపోటు వచ్చింది. ఈ నేపథ్యంలో వైద్యం కోసం దోచిన సొమ్ములో చాలా వరకు ఖర్చు చేయాల్సి వచ్చిందని అతడు పోలీసులకు తెలిపాడు.