LIC IPO | ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) ఐపీవో ముహూర్తం ఖరారైనట్లు కనిపిస్తున్నది. వచ్చేనెల నాలుగో తేదీన దేశీయ స్టాక్ మార్కెట్లను ఎల్ఐసీ ఐపీవో తాకనుందని తెలుస్తున్నది. మే 9న ముగుస్తుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. దీనిపై ఈ నెల 27న క్లారిటీ వస్తుందని అంటున్నాయి. ఎల్ఐసీ ఐపీవో ఎప్పుడు ప్రారంభమయ్యేది వచ్చేవారం ఖచ్చితంగా తెలుస్తుందని అధికార వర్గాల కథనం.
ఇప్పటికే ఎల్ఐసీ ఐపీవో నిడివిని సంస్థ డైరెక్టర్ల బోర్డు ఐదు శాతం నుంచి 3.5 శాతానికి కుదించివేసిందని అధికార వర్గాల కథనం. ఎల్ఐసీలో కేంద్ర ప్రభుత్వం 3.5 శాతం వాటా విక్రయం ద్వారా రూ.21 వేల కోట్ల నిధులు సేకరించనున్నది. అయితే, తాజా ప్రతిపాదనకు సెబీ నుంచి ఆమోదం లభించాల్సి ఉంటుంది.
ఇంతకుముందు ఎల్ఐసీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.17 లక్షల కోట్లు ఉంటుందని సెబీకి ఎల్ఐసీ సమర్పించిన డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్లో పేర్కొంది. సెబీ ఆమోదిస్తే ఐదు శాతం వాటా విక్రయించాలని ఇంతకుముందు కేంద్రం భావించింది.