LIC | న్యూఢిల్లీ, ఏప్రిల్ 15: ఐపీవో జారీ అయిన తర్వాత మళ్లీ ఏనాడూ ఆఫర్ ధరను చేరకపోవడం మాట అటుంచి, రోజు రోజుకీ తగ్గిపోతున్న ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) షేరు నుంచి రిటైల్ ఇన్వెస్టర్లు క్రమేపీ వైదొలుగుతున్నారు. 2023 జనవరి-మార్చి త్రైమాసికంలో 62,668 మంది చిన్న మదుపరులు ఎల్ఐసీ షేర్లను విక్రయించారు. రూ. 2 లక్షల వరకూ పెట్టుబడి చేసినవారిని రిటైల్ ఇన్వెస్టర్లుగా పరిగణిస్తారు. గత ఏడాది మే 17న ఎల్ఐసీ షేరు లిస్టయినప్పటి నుంచి ఇప్పటివరకూ పతనబాటలోనే పయనిస్తున్నది. లిస్టింగ్ రోజు నుంచి ఈ మార్చి 31 వరకూ 6.87 లక్షల మంది రిటైలర్లు ఎల్ఐసీ పెట్టుబడుల్ని నష్టాలకు విక్రయించి, వైదొలిగినట్టు సంస్థ స్టాక్ ఎక్సేంజీలకు సమర్పించిన సమాచారం వెల్లడిస్తున్నది. ఎల్ఐసీ రూ. 949 ధరతో ఐపీవో జారీ చేయగా, చిన్న ఇన్వెస్టర్లకు రూ. 904 డిస్కౌంట్ ధరతో షేర్లను కేటాయించింది. ఈ షేరు మార్చి 29న రూ. 530 రికార్డు కనిష్టస్థాయిని తాకింది. ఎన్ఎస్ఈలో ఏప్రిల్ 15న ఎల్ఐసీ షేరు రూ. 551 వద్ద ముగిసింది. అంటే కేవలం 11 నెలల్లో రిటైల్ ఇన్వెస్టర్లకు ఈ షేరు 40 శాతం నష్టాన్ని తెచ్చిపెట్టింది. సంస్థాగత ఇన్వెస్టర్ల నష్టం ఇంతకంటే ఎక్కువే.
ఎల్ఐసీ షేరు నుంచి అత్యధిక సంఖ్యలో రిటైల్ ఇన్వెస్టర్లు వైదొలిగినప్పటికీ, సంస్థ మొత్తం పబ్లిక్ వాటాలో రిటైల్ ఇన్వెస్టర్ల వద్దనున్న షేర్ల శాతం పెరిగింది. ఇంకా ఈ షేరులో కొనసాగుతున్న కొంతమంది చిన్న మదుపరులు ధర తగ్గినపుడు మరిన్ని షేర్లను కొనుగోలు చేయడమే ఇందుకు కారణం. 2022 డిసెంబర్ చివరినాటికి 12.11 కోట్ల షేర్లు రిటైలర్ల హోల్డింగ్లో ఉండగా, 2023 మార్చి చివరికల్లా 33.01 లక్షల మంది రిటైలర్ల వద్దనున్న ఎల్ఐసీ షేర్ల సంఖ్య 12.89 కోట్లకు పెరిగింది. దీంతో మొత్తం పబ్లిక్ వాటాలో రిటైలర్ల వద్దనున్న షేర్ల శాతం 1.94 నుంచి 2.04 శాతానికి చేరింది. ఐపీవోలో 39.86 లక్షల మంది ఇన్వెస్టర్లు 10.51 కోట్ల షేర్లను (1.66 శాతం) కొనుగోలు చేశారు. దీని ప్రకారం ఐపీవో తర్వాత 6 లక్షలకు పైగా రిటైలర్లు ఎల్ఐసీకి బై చెప్పినప్పటికీ, ప్రస్తుతం కొనసాగుతున్న చిన్న మదుపరులు ఈ మధ్యకాలంలో 2.38 కోట్ల షేర్లను అదనంగా చేర్చుకున్నట్టు ఎక్సేంజ్ డేటా వెల్లడిస్తున్నది.
మరోవైపు ఎల్ఐసీ షేరుపై విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐలు) సైతం విశ్వాసం కోల్పోయినట్టు కన్పిస్తున్నది. ఐపీవో లిస్టయినప్పటి నుంచి ఇప్పటివరకూ వారు 54.43 లక్షల షేర్లు విక్రయించారు. దీంతో ఎల్ఐసీ మొత్తం పబ్లిక్ వాటాలో ఎఫ్పీఐల వాటా 0.17 శాతం నుంచి 0.08 శాతానికి తగ్గింది. దేశీ మ్యూచువల్ ఫండ్స్ కూడా వాటాను 0.66 శాతం నుంచి 0.63 శాతానికి తగ్గించుకున్నాయి.
భవిష్యత్తులో ఎల్ఐసీ షేరు బౌన్స్బ్యాక్ అవుతుందన్న అంచనాల్ని కొంతమంది విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. ప్రైవేటు బీమా సంస్థలు వాటి వ్యాపారంలో దూకుడు ప్రదర్శిస్తున్నందున, కొద్ది ఏండ్లుగా ఎల్ఐసీ మార్కెట్ వాటా తగ్గుతున్నదని, కానీ జారీచేసే బీమా పత్రాల్లో చేస్తున్న మార్పులు, గ్రామీణ ప్రాంతాల్లోకి మరింతగా చొచ్చుకు వెళ్లేందుకు చేస్తున్న ప్రయత్నాల కారణంగా ఎల్ఐసీ పుంజుకుంటుందని రెలిగేర్ బ్రోకింగ్ పేర్కొంది. ఇదేరీతిలో ఐసీఐసీఐ సెక్యూరిటీస్ కూడా ఎల్ఐసీ షేరు బై రేటింగ్ ఇస్తూ ప్రొడక్ట్ మిక్స్తో వీఎన్బీ మార్జిన్లను (బీమా కంపెనీల లాభదాయకత) వచ్చే 3-4 ఏండ్లలో పెంచుకోవాలన్న ఎల్ఐసీ యాజమాన్యం లక్ష్యాన్ని చేరుకోవచ్చని పేర్కొంది.