ముంబై, నవంబర్ 11: దేశీయ బీమా దిగ్గజం ఎల్ఐసీ రికార్డు స్థాయి లాభాలను ఆర్జించింది. సెప్టెంబర్ త్రైమాసికానికిగాను సంస్థ రూ.15,592 కోట్ల నికర లాభాన్ని గడించింది. పెట్టుబడులపై రాబడి అత్యధికంగా సమకూరడం వల్లనే లాభాలు భారీగా పెరిగాయని పేర్కొంది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో సంస్థ రూ.1,434 కోట్ల లాభాన్ని నమోదు చేసుకున్నది. ఏడాది క్రితం రూ.18,72,043.6 కోట్లుగా ఉన్న సంస్థ మొత్తం ఆదాయం గత త్రైమాసికం చివరినాటికి రూ.22,29,488.5 కోట్లకు చేరుకుంది. సమీక్షకాలంలో మొత్తం ప్రీమియం వసూళ్ళు రూ.1,32,631.72 కోట్లకు చేరుకున్నాయి.
బీమా లోక్పాల్ దినోత్సవం
బీమా లోక్పాల్ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని ఎల్ఐసీ జోనల్ ట్రైనింగ్ సెంటర్లో ఇన్సూరెన్స్ అంబుడ్స్మన్ శుక్రవారం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో జీవిత బీమా, జీవిత బీమాయేతర సంస్థల ప్రతినిధులందరూ పాల్గొన్నారు. ఆన్లైన్ ద్వారా వీరినుద్దేశించి బీమా రంగ రెగ్యులేటర్ ఐఆర్డీఏఐ చైర్మన్ దేబాశిశ్ పండా ప్రసంగించారు.