layoffs : ఐటీ అనుబంధ సంస్థల్లో భారీ స్థాయిలో లేఆఫ్స్ కొనసాగుతున్నాయి. ఏఐ కారణంగా ఆయా సంస్తల్లో వేలాది మందిని ఉద్యోగంలోంచి తొలగిస్తున్నారు. త్వరలో టాప్ కంపెనీల్లో కూడా భారీగా కోతలు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. మెటా, ఒరాకిల్, మైక్రోసాఫ్ట్ సంస్థలు కలిసి వచ్చే జూన్లో భారీగా ఉద్యోగుల్ని తొలగించబోతుంది. ఈ మూడు సంస్థలు కలిసి జూన్లో ఏకంగా 46,750 మంది సిబ్బందిని తొలగించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. గత మార్చిలో కూడా అనేక సంస్థలు ఉద్యోగుల్ని తొలగించాయి.
ఏఐ టెక్నాలజీ మీద పెట్టుబడులకు సిద్ధమవ్వడం, కంపెనీలో నిర్మాణాత్మక మార్పుల కారణంగా ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లు కంపెనీలు చెబుతున్నాయి. ఒకవైపు తమ కంపెనీలు వృద్ధి బాటలోనే నడుస్తున్నాయని చెబుతూనే, భవిష్యత్తు బాగుంటుందని చెబుతూనే ఉద్యోగుల్ని తొలగిస్తుండటం విశేషం. మెటా, ఒరాకిల్, మైక్రోసాఫ్ట్ సంస్థలు కూడా ఇప్పుడు ఇంకో 46,750 మందిని తొలగించబోతుండటం ఆసక్తికరంగా మారింది. మెటా సంస్థ తన కంపెనీలో పని చేస్తున్న వారిలో పది శాతం మంది ఉద్యోగుల్ని.. అంటే కనీసం 8,000 మందిని తొలగించాలని నిర్ణయించింది. అలాగే, కొత్తగా కొంతమందిని ఉద్యోగాల్లోకి తీసుకోవాలి అని ఇంతకుముందు తీసుకున్న నిర్ణయాన్ని వాయిదా వేసింది. ఇదే సమయంలో ఏఐ టెక్నాలజీపై మెటా భారీగా పెట్టుబడులు పెడుతోంది. ఈ ఏడాది 135 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేయాలని కంపెనీ నిర్ణయించింది. అంటే, గత మూడేళ్లలో కంపెనీ ఏఐ మీద పెట్టుబడి పెట్టిన దానితో సమానం.
ఏఐ టెక్నాలజీ సిబ్బంది అవసరాన్ని తగ్గిస్తుందని గతంలోనే మెటా సీఈవో మార్క్ జుకర్బర్గ్ ప్రకటించారు. ఒరాకిల్ సంస్థ కూడా 30,000 మందిని తొలగించబోతుంది. ఇప్పటికే కొందరికి దీనికి సంబంధించిన మెయిల్స్ వచ్చినట్లు ఉద్యోగులు చెబుతున్నారు. మెయిల్ వచ్చినప్పటి నుంచే ఉద్యోగంలోంచి తొలగిస్తారు. మరోవైపు మైక్రోసాఫ్ట్ సంస్థ 8,750 మంది సిబ్బందిని తొలగించాలని నిర్ణయించింది. అంటే సంస్థలో 7 శాతం సిబ్బందిని తొలగించబోతుంది. అయితే, సిబ్బందికి వాలంటరీ రిటైర్మెంట్ అవకాశం కల్పిస్తోంది. మైక్రోసాఫ్ట్ స్థాపించిన 51 ఏళ్లలో ఇలాంటి ప్రతిపాదన తీసుకురావడం ఇదే మొదటిసారి.