న్యూఢిల్లీ, మే 31: గత ఆర్థిక సంవత్సరం (2022-23) చివరి త్రైమాసికం జనవరి-మార్చి (క్యూ4)లో దేశ జీడీపీ 6.1 శాతంగా నమోదైంది. ఈ నేపథ్యంలో మొత్తం ఆర్థిక సంవత్సరం దేశ వృద్ధిరేటు 7.2 శాతాన్ని తాకింది. వ్యవసాయం, తయారీ, గనులు, నిర్మాణ రంగాల కార్యకలాపాలు బాగుండటమే ఇందుకు కారణమని బుధవారం విడుదల చేసిన అధికారిక గణాంకాల్లో జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్వో) పేర్కొన్నది. అయినప్పటికీ అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2021-22) దేశ జీడీపీ 9.1 శాతంగా ఉండటం గమనార్హం. దాంతో పోల్చితే ఈసారి వృద్ధిరేటు దాదాపు 2 శాతం క్షీణించింది. అలాగే నిరుడు ఏప్రిల్-జూన్లో వృద్ధిరేటు 13.1 శాతంగా ఉండటం గమనించదగ్గ అంశం. ఇక తాజా వృద్ధి.. దేశ ఆర్థిక వ్యవస్థను 3.3 లక్షల కోట్ల డాలర్లకు తీసుకెళ్లిందని, వచ్చే కొన్నేండ్లలో 5 లక్షల కోట్ల డాలర్ల లక్ష్యాన్ని సాధించగలమన్న ఆశాభావాన్ని ఈ సందర్భంగా ఎన్ఎస్వో వ్యక్తం చేసింది.
ద్రవ్యలోటు 6.4 శాతం
2022-23కుగాను దేశ జీడీపీలో కేంద్ర ప్రభుత్వ ద్రవ్యలోటు 6.4 శాతంగా నమోదైంది. ఇది రూ.17,33,131 కోట్లకు సమానం. గత ఆర్థిక సంవత్సరం కేంద్ర ప్రభుత్వానికి రూ.24.56 లక్షల కోట్ల ఆదాయం వచ్చింది. ఇందులో రూ.20.97 లక్షల కోట్లు పన్ను ఆదాయం అవగా.. రూ.2.86 లక్షల కోట్లు పన్నేతర ఆదాయం, రూ.72,187 కోట్లు రుణేతర మూలధన ఆదాయంగా ఉన్నాయి. మొత్తం ఖర్చులు గత ఆర్థిక సంవత్సరం రూ.41.89 లక్షల కోట్లు. ఇందులో రెవిన్యూ అకౌంట్పై రూ.34.52 లక్షల కోట్లు, క్యాపిటల్ అకౌంట్పై రూ.7.36 లక్షల కోట్లున్నాయి. 2021-22లో ఇది దేశ జీడీపీలో 6.71 శాతంగా ఉండగా, 2023-24లో దీన్ని 5.9 శాతానికి కట్టడి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది. అయితే గత నెల ఏప్రిల్లో ద్రవ్యలోటు 7.5 శాతంగా ఉన్నది. నిరుడు ఇదే నెల 4.5 శాతంగానే ఉండటం గమనార్హం.