Jio 5G | రిలయెన్స్ జియో కస్టమర్లకు శుభవార్త. ఇవాల్టి నుంచి 50 నగారల్లో 5 జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. 5 జీ సేవలను మంగళవారం నుంచి అందిస్తున్నట్లు రిలయన్స్ జియో సంస్థ తెలిపింది. దీంతో దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాల్లోని 184 నగరాల్లో 5 జీ సేవలు అందుబాటులోకి వచ్చినట్లవుతుంది.
5 జీ సేవలు ప్రారంభించిన ప్రాంతాల్లో రిలయెన్స్ జియో వినియోగదారులకు ‘జియో వెల్కమ్ ఆఫర్’ ఆహ్వానాలు అందుతున్నాయి. ఈ ఆఫర్ కింద వినియోగదారులు అపరిమిత 5జీ డాటాను 1 జీబీపీఎస్ వరకు వేగాన్ని పొందే వీలున్నది. ఇందుకోసం ఎలాంటి అదనపు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. సంక్రాంతి పండగ రోజున ఛత్తీస్గఢ్ లోని రాయ్పూర్, దుర్గ్, భిలాయ్ నగరాల్లో జియో ట్రూ 5జీ సేవలను రిలయెన్స్ ప్రారంభించింది. 2023 డిసెంబర్ నాటికి దేశంలోని ప్రతి నగరంలో 5జీ సేవలను అందించాలని జియో యోచిస్తున్నది.
రిలయెన్స్ కంపెనీ ప్రకటన ప్రకారం, ప్రస్తుతం 5 జీ సేవలు ప్రారంభించిన 50 నగరాలు.. ఆంధ్రప్రదేశ్, అసోం, చత్తీస్గఢ్, గోవా, హర్యానా, జార్ఖండ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా, పుదుచ్చేరి, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు రాష్ట్రాల్లో ఉన్నాయి. ఈ నగరాల్లోని జియో వినియోగదారులు ఇవాల్టి నుంచి అదనంగా ఎలాంటి చార్జీలు చెల్లించకుండానే గరిష్టంగా 1 జీబీపీఎస్ వేగంతో అపరిమిత డాటాను పొందేందుకు జియో వెల్కమ్ ఆఫర్ను అందిస్తున్నది. ఇవాల్టి నుంచి ఏపీలోని చిత్తూరు, కడప, నరసరావుపేట, ఒంగోలు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, విజయనగరం నగరాల్లో జియో 5 జీ సేవలు అందనున్నాయి.