ముంబై: రిలయన్స్ జియో కంపెనీ దేశంలోని మరో 34 నగరాలకు తన 5జీ సేవలను విస్తరించింది. ఇవాళ 13 రాష్ట్రాల్లోని 34 నగరాల్లో కొత్తగా ట్రూ 5జీ సేవలను ప్రారంభించింది. ఇటీవలే ఆరు ఈశాన్య రాష్ట్రాల్లోని షిల్లాంగ్, ఇంఫాల్, ఐజ్వాల్, అగర్తలా, ఇటానగర్, కొహిమా, దిమాపూర్ నగరాల్లో కూడా రిలయన్స్ ట్రూ 5జీ సేవలు ప్రారంభమయ్యాయి. దాంతో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 5జీ సేవలు అందుబాటులోకి వచ్చిన నగరాల జాబితా 225కు చేరుకుంది.
కొత్తగా 5జీ సేవలు అందుబాటులోకి వచ్చిన 34 నగరాల్లో తమిళనాడు నుంచి 8, ఆంధ్రప్రదేశ్ నుంచి 6, తెలంగాణ, అసోం రాష్ట్రాల నుంచి మూడేసి చొప్పున.. హర్యానా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్ రాష్ట్రాల నుంచి రెండేసి చొప్పున.. బీహార్, కర్ణాటక, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ నుంచి ఒక్కోటి చొప్పున ఉన్నాయి.
ఆయా నగరాల్లోని జియో 5జీ వినియోగదారులకు రిలయన్స్ సంస్థ వెల్కమ్ ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్ కింద ఎలాంటి అదనపు రుసుములు వసూలు చేయకుండానే 1 జీబీపీఎస్ ప్లస్ స్పీడుతో అన్లిమిటెడ్ డాటాను అందించనున్నారు. కాగా, కేవలం 120 రోజులలోనే తాము తమ ట్రూ 5జీ సేవలను 225 నగరాలకు విస్తరించగలిగామని రిలయన్స జియో సంస్థ పేర్కొన్నది. ఈ ఏడాది చివరి నాటికి తమ సేవలను దేశమంతటికీ విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది.