Jio Financial | ముకేశ్ అంబానీ సారధ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి విడివడిన జియో ఫైనాన్సియల్ సర్వీసెస్ (Jio Financial Services) కు ఇన్వెస్టర్లు షాక్ ఇచ్చారు. గత నెలలో రిలయన్స్ నుంచి విడిపోయిన జియో ఫైనాన్సియల్ సర్వీసెస్ సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో లిస్టయింది. భారీ అంచనాలతో వచ్చినా.. ఇన్వెస్టర్లను ఆకట్టుకోలేక పోయింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ) లో రూ.262 వద్ద జియో ఫైనాన్సియల్ ట్రేడింగ్ ప్రారంభమైనా, తర్వాత ఐదు శాతం నష్టంతో లోయర్ సర్క్యూట్ రూ.248.90 వద్దకు పడిపోయింది.
గత నెలలో జియో ఫైనాన్సియల్ సర్వీసెస్ స్టాక్ విలువ ఖరారు చేయడానికి రిలయన్స్ నిర్వహించిన స్పెషల్ ట్రేడింగ్లో.. దాని విలువ రూ.261.85గా నిర్ణయించారు. ఆ విలువతోనే ట్రేడింగ్ ప్రారంభమైనా.. తొలుత లాభాల్లోనే కొనసాగింది. అలా జియో ఫైనాన్సియల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1.59 లక్షల కోట్ల వద్ద నిలిచింది. వచ్చే పది రోజులు జియో ఫైనాన్సియల్ టీ గ్రూప్ షేర్గా కొనసాగుతుంది. టీ గ్రూప్ అంటే ట్రేడ్ టూ ట్రేడ్ షేర్లు అని అర్థం. ఈ షేర్ల మధ్య అంతర్గత ట్రేడింగ్ కు అనుమతించరు.