న్యూఢిల్లీ : మనీల్యాండరింగ్ కేసుకు సంబంధించి రూ. 538 కోట్ల విలువైన జెట్ ఎయిర్వేస్ (Jet Airways) ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సీజ్ చేసింది. మనీల్యాండరింగ్ నియంత్రణ చట్టం, 2002 నిబంధనల కింద ఈ ఆస్తులను ఈడీ జప్తు చేసింది. జెట్ ఎయిర్వేస్ వ్యవస్ధాపకుడు నరేష్ గోయల్, ఆయన కుమారుడు, భార్యకు చెందిన పలు ఆస్తులను ఈడీ స్వాధీనం చేసుకుంది.
కమర్షియల్ క్యారియర్ జెట్ ఎయిర్వేస్ దశాబ్ధాల తరబడి సేవలందించిన అనంతరం నగదు నిల్వల కొరత ఇతర ఆర్ధిక ఇబ్బందులతో 2019 ఏప్రిల్లో మూతపడింది. అదే ఏడాది జూన్లో నరేష్ గోయల్ కంపెనీ బాధ్యతల నుంచి వైదొలగిన అనంతరం జెట్ ఎయిర్వేస్ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ) వద్ద దివాళా పిటిషన్ దాఖలు చేసింది.
ఇక లండన్, దుబాయ్, భారత్లోని పలు ప్రాంతాల్లోని నివాస సముదాయాలు, బంగళాలు, వాణిజ్య భవనాలతో పాటు నరేష్ గోయల్, ఆయన భార్య అనితా గోయల్, కుమారుడు నివాన్ గోయల్ పేరిట ఉన్న వివిధ ఆస్తులను ఈడీ సీజ్ చేసింది. కెనరా బ్యాంక్ను రూ. 538 కోట్లకు మోసం చేసిన కేసులో ఈ ఏడాది సెప్టెంబర్లో 74 ఏండ్ల నరేష్ గోయల్ను ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. నేరం చేయడం ద్వారా సమకూరిన నిధులతోనే గోయల్ కుటుంబసభ్యులు విదేశాల్లో ఆస్తులు కొనుగోలు చేశారని ఈడీ ఆరోపిస్తోంది.
Read More :
OnePlus Watch 2 | దేశీ మార్కెట్లో త్వరలో వన్ప్లస్ వాచ్ 2 లాంఛ్