హైదరాబాద్, జనవరి 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పెట్టుబడులకు అనువైన వాతావరణం ఉన్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. రైతులకు ప్రయోజనం కలిగే విధంగా విధానాలను రూపొందిస్తున్నట్లు, దళారి వ్యవస్థ లేకుండా నేరుగా రైతులకు ప్రయోజనం కలిగేలా చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. సోమవారం హైదరాబాద్లో వీ-హబ్లో ఆస్ట్రేలియా హైకమిషనర్ ఫిలిప్ గ్రీన్, బెంగళూరు కాన్సులేట్ జనరల్ హిలరి మెక్గెచ్చితో శ్రీధర్ బాబు భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా వీ-హబ్తో ఆస్ట్రేలియా ప్రభుత్వం ఒప్పందాన్ని కుదుర్చుకున్నది. యువతలో నైపుణ్యాలను పెంపొందించడానికి ఆయా కోర్సుల్లో శిక్షణ అందించడానికి ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. వ్యవసాయ రంగం, దాని ఆధారిత రంగాలను మరింత లాభసాటిగా మార్చేందుకు యూనివర్సిటీలు, నిపుణులు, పరిశోధకులు ఎప్పటికప్పుడు కృషి చేస్తున్నారని చెప్పారు.
ముఖ్యంగా మహిళా సాధాకారత పునాదులపై తెలంగాణ వృద్ధి ఆధారపడి ఉంటుందని తాము విశ్వసిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆస్ట్రేలియా హైకమిషనర్ ఫిలప్ గ్రీన్ మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీలు బాగున్నాయని, ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలన్నది మంచి ఆలోచన అని కితాబిచ్చారు.