పాలసీ ప్రారంభ నిబంధనల్ని సరళతరం చేసిన ఐఆర్డీఏఐ
న్యూఢిల్లీ, జూలై 14: వ్యవసాయ బీమా పాలసీల పరిచయానికి సంబంధించి నిబంధనలను బీమా రంగ రెగ్యులేటర్ ఐఆర్డీఏఐ సరళతరం చేసింది. ముందస్తుగా తమ అనుమతి లేకుండానే వ్యవసాయం, దాని అనుబంధ కార్యకలాపాల కోసం బీమా పాలసీలను జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలు ప్రారంభించుకోవచ్చని గురువారం తెలియజేసింది. గత నెల ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏఐ) ఆరోగ్య బీమా పాలసీల ప్రారంభానికి సంబంధించీ ఇదేతరహా నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. చాలావరకు జనరల్ ఇన్సూరెన్స్ ఉత్పత్తులకు ‘యూజ్ అండ్ ఫైల్’ విధానం పరిధినీ పొడిగించింది. దీంతో మార్కెట్ అవసరాలకు అనుగుణంగా బీమా కవరేజీల ధర, శైలిని నిర్దేశించుకునేందుకు మరింత వెసులుబాటు బీమా సంస్థలకు వచ్చింది.
కొత్త పాలసీలు మార్కెట్లోకి వేగంగా రావడానికీ మార్గం సుగమమైంది. నిజానికి చాలా జీవిత బీమా పాలసీలకూ ‘యూజ్ అండ్ ఫైల్’ విధానాన్ని ఐఆర్డీఏఐ పొడిగించింది. ఈ క్రమంలో వ్యవసాయం, దాని అనుబంధ కార్యకలాపాల కవరేజీని పెంచేలా, వీటికి తగిన పాలసీల రూపకల్పనపైనా ఐఆర్డీఏఐ దృష్టి సారించింది. ఇందులోభాగంగానే ‘యూజ్ అండ్ ఫైల్’ విధానం కింద వ్యవసాయం, దాని అనుబంధ కార్యకలాపాల కోసం రిటైల్ పాలసీల ఫైల్కు జనరల్ ఇన్సూరర్లను తాజాగా అనుమతించింది. వ్యవసాయం, దాని అనుబంధ కార్యకలాపాలపై ఆధారపడి దేశంలో అత్యధికులు జీవిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఐఆర్డీఏఐ నిర్ణయం వ్యవసాయ బీమాకు ఊతమివ్వనున్నది.