Investers Wealth | అమెరికా ఫెడ్ రిజర్వ్ కీలక వడ్డీరేట్లు పెంచడంతో అంతర్జాతీయ మార్కెట్లతోపాటు భారత స్టాక్ మార్కెట్లు కూడా భారీ నష్టాలను మూటగట్టుకుంటున్నాయి. గత నాలుగు సెషన్లలో ఇన్వెస్టర్లు రూ.13 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. సోమవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్ఈ) ఇండెక్స్ సెన్సెక్స్ 954 పాయింట్ల నష్టంతో 57,145 పాయింట్లు, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ 297.90 పాయింట్ల పతనంతో 17,029 పాయింట్ల వద్ద స్థిర పడ్డాయి.
రియాల్టీ, ఆటో, మెటల్, ప్రభుత్వ రంగ బ్యాంకుల స్టాక్స్ భారీగా నష్టాలను చవి చూశాయి. ఇతర అన్ని సెక్టార్ల స్క్రిప్ట్లు కూడా అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ సుమారు మూడు శాతం నష్టపోయాయి. ఈ నెల 20న బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.283 లక్షల కోట్ల నుంచి సోమవారం ట్రేడింగ్ ముగిసే సరికి రూ.270 లక్షల కోట్లకు పరిమితమైంది.
పెరుగుతున్న ధరలను కట్టడి చేయడానికి ప్రపంచ దేశాల సెంట్రల్ బ్యాంకులు వడ్డీరేట్ల పెంపులో దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. ఫలితంగా వృద్ధిరేటు మందగమనంలో సాగుతున్నది. క్రెడిట్ గ్రోత్తోపాటు పన్ను వసూళ్లు పుంజుకోవడంతో భారత్లో పరిస్థితులు మెరుగ్గా ఉన్నాయి. అయితే, మార్కెట్లలో స్థిరత్వం వచ్చే వరకు ఇన్వెస్టర్లు కాస్త వేచి ఉండాలని జియోజిట్ ఫైనాన్సియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ సూచించారు.
శుక్రవారం ట్రేడింగ్లో అమెరికా మార్కెట్లు 2.50 శాతానికి పైగా నష్టపోయాయి. డో సుమారు 500 పాయింట్ల పతనంతో 22 నెలల కనిష్ఠ స్థాయికి పడిపోయింది. డోజోన్స్ 1.6 శాతం, నాస్డాక్ 1.8, ఎస్ అండ్ పీ 1.7 శాతం నష్టాలతో ముగిశాయి. మరోవైపు అమెరికా డాలర్పై రూపాయి మారకం విలువ మరో ఆల్టైం కనిష్టాన్ని తాకింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి 58 పైసలు పతనమై రూ.81.67 వద్ద స్థిర పడింది.