Sensex | దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం ఊగిసలాట మధ్య నష్టాలతో ముగిశాయి. ప్రధాన ద్రవ్యోల్బణం ఆందోళనకర స్థాయిలో ఉంటుందన్న నేపథ్యంలో మరోదఫా వడ్డీరేట్లను ఆర్బీఐ పెంచనున్నదన్న అంచనాల మధ్య ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలహీనపడింది. ఫలితంగా బీఎస్ఈ-30 ఇండెక్స్ సెన్సెక్స్ 220.96 పాయింట్ల నష్టంతో 60,286 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ సైతం 43.10 పాయింట్ల పతనంతో 17,721.50 పాయింట్ల వద్ద స్థిర పడింది.
ఫలితంగా బీఎస్ఈ-30 ఇండెక్స్ సెన్సెక్స్ ఇంట్రాడే ట్రేడింగ్లో 592 పాయింట్ల పతనంతో 60,063.5 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ సైతం అంతర్గత ట్రేడింగ్లో 17,622.5 పాయింట్ల కనిష్టానికి పతనమై తిరిగి పుంజుకుని 17,722 పాయింట్ల వద్ద నిలిచింది. అదానీ ఎంటర్ప్రైజెస్ 15 శాతం, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, అదానీ పోర్ట్స్, కొటక్ మహీంద్రా బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఆటో, ఓఎన్జీసీ, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఎచిర్ మోటార్స్ స్టాక్స్ మార్కెట్ల రికవరీకి దోహద పడ్డాయి.
బీఎస్ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ స్వల్పంగా 0.02 శాతం లాభ పడగా, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.17 శాతం నష్ట పోయాయి. మరోవైపు నిఫ్టీ ఎఫ్ఎంసీజీ ఇండెక్స్ 1.16 శాతం, ఆటో ఇండెక్స్ ఒక శాతం, రియాల్టీ 0.88 శాతం నష్టాలతో ముగిశాయి. మంగళవారం ట్రేడింగ్లో ఫిన్టెక్ సంస్థ పేటీఎం పేరెంట్ వన్97 కమ్యూనికేషన్స్ షేర్.. బీఎస్ఈ ఇంట్రాడే ట్రేడింగ్లో 20 శాతం పుంజుకుని రూ.66.9.60 వద్దకు దూసుకెళ్లి, ట్రేడింగ్ ముగిసే సమయానికి రూ.588.60 వద్ద స్థిర పడింది. ఇక ఫారెక్స్ మార్కెట్లో ట్రేడింగ్ ముగిసే సమయానికి డాలర్పై రూపాయి మారకం విలువ రూ.82.70 వద్ద ముగిసింది.
బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్లో కేవలం తొమ్మిది షేర్లు.. కొటక్ మహీంద్రా బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, ఎల్అండ్ టీ, ఎస్బీఐ, టీసీఎస్, హెచ్డీఎఫ్సీ, ఏషియన్ పెయింట్స్ లాభాలు గడించాయి. టాటా స్టీల్, ఐటీసీ, సన్ ఫార్మా, మారుతి సుజుకి, హెచ్సీఎల్ టెక్, టాటా మోటార్స్, హెచ్యూఎల్, విప్రో, ఆల్ట్రా టెక్ సిమెంట్స్, ఇన్ఫోసిస్ భారీగా నష్టపోయాయి.
ఇక గత నెల 25 నుంచి తీవ్ర నష్టాల్లో సాగుతున్న అదానీ గ్రూప్ స్టాక్స్కు రిలీఫ్ లభించింది. ముందస్తుగా తనఖా షేర్లు విడిపించుకునేందుకు రూ.9,200 కోట్ల చెల్లింపులు చేస్తామని అదానీ గ్రూప్ ప్రకటించడంతో మంగళవారం అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్ 15.36 శాతం లాభ పడితే, అదానీ విల్మర్ 4.99 శాతం పెరిగింది. అదానీ పోర్ట్స్ సైతం లాభాల్లోనే ముగిసింది.