Intel | ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్యం కారణంగా ఐటీ కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఆర్థిక పరిస్థితుల కారణంగా ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా ఇప్పటికే పలు ఐటీ కంపెనీలు లేఆఫ్లు ప్రకటించాయి. అయితే మరో టెక్ దిగ్గజ సంస్థ ఇంటెల్ (Intel) అన్ని కంపెనీల కంటే వినూత్నంగా ఆలోచించింది. ఉద్యోగులను తొలగించకుండా వారి జీతాల్లో కోత విధించాలని నిర్ణయించింది. కంపెనీ సీఈవో స్థాయి నుంచి కింది స్థాయి ఉద్యోగుల వరకు ఈ నిబంధనలు అమలు చేయాలని నిర్ణయించింది. దీంతో సీఈవో, ఎగ్జిక్యూటివ్ స్థాయి ఉద్యోగుల నుంచి కింది స్థాయి ఉద్యోగుల వరకు ఈ నిబంధనను అమలు చేయనున్నట్లు ఇంటెల్ తెలిపింది.
ఇంటెల్ తాజా నిర్ణయంతో ఆ సంస్థ సీఈవో పాట్ గెల్సింగర్ వేతనంలో 25 శాతం, ఎగ్జిక్యూటివ్ స్థాయి ఉద్యోగులకు 15 శాతం, సీనియర్ మేనేజర్లకు 10 శాతం, మధ్యస్థాయి మేనేజర్లకు 5 శాతం కోత విధిస్తారు. కంపెనీపై పెరిగిపోతున్న ఆర్థిక పరమైన భారాన్ని తగ్గించుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఇంటెల్ తెలిపింది. సంస్థ భవిష్యత్తుకు ఇది దోహదం చేస్తుందని భావిస్తున్నట్టు పేర్కొంది.
ఆర్థిక మాంద్యం నేపథ్యంలో కంపెనీలన్నీ వరుసగా ఉద్యోగులను తొలగిస్తున్న ఈ తరుణంలో.. ఇంటెల్ భిన్నంగా ఆలోచించడాన్ని నిపుణులు మెచ్చుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వేతనం కొంత తగ్గినా పర్వాలేదు కానీ ఉన్నపళంగా ఉద్యోగం పోతే కష్టమేనని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఇంటెల్ నిర్ణయాన్ని ఆహ్వానించాల్సిందేనంటూ చెప్పుకుంటున్నారు.