క్యాన్సర్ ఓ మహమ్మారి. మారుతున్న జీవనశైలే కావచ్చు.. జన్యుపరమైన సమస్యలే అనుకోవచ్చు.. చాలామందిలో ఇప్పుడీ జబ్బు వేగంగా ప్రబలుతోంది.
ఇంటి పక్కన షరీఫ్, ఎదురింట్లోని డేవిడ్, బంధువుల్లోని సుబ్బారావు ఇలా ఎందరో దీని బారినపడి తనువు చాలించినవాళ్లే. స్పష్టంగా ఎందుకొస్తుందో, ఎప్పుడొస్తుందో తెలియని ఈ వ్యాధి.. కేవలం గత ఏడాదే సుమారు 8 లక్షల మందిని బలితీసుకుందని ఓ అంచనా. ప్రతీ మరణం ప్రభుత్వ లెక్కల్లోకి రాదుకాబట్టి ఈ సంఖ్య ఇంకా ఎక్కువేనన్నా అతిశయోక్తి కాదు. అయితే ఈ రాచపుండు బారినపడిన మనిషే కాదు.. వాళ్ల కుటుంబం కూడా ఆర్థికంగా, మానసికంగా కుంగిపోతుంది. అయినప్పటికీ ఏదైనా బీమా ఉంటే ఆసరాగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఏదో ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది కదా.. చాలదా అని అనుకునే ఆలోచనా నుంచి బయటకురావాలి. మన చుట్టూ ఉన్న వాతావరణం, తిండి, ఒత్తిడి కారణంగా అందరిలో క్యాన్సర్ ముప్పు పెరుగుతున్నది మరి. ఇదేదో భయపెట్టడానికి చెప్తున్న మాట కాదు.. భవిష్యత్తును ప్లాన్ చేసుకోవడానికి, ఏదైనా అనుకోని షాక్ తగిలినప్పుడు కుటుంబం ఇబ్బంది పడకూడదని ఇస్తున్న సలహా. నిజానికి క్యాన్సర్ బారినపడిన వాళ్లలో 60 శాతం మంది ఇన్సూరెన్స్ ఉన్నాసరే తమ జేబుల నుంచి ఖర్చులు పెట్టుకుంటున్నారని సమాచారం. దీనికి కారణం సరైన పాలసీ లేకపోవడమే.
ఒక వ్యక్తికి క్యాన్సర్ సోకితే వాళ్లు ప్రధానంగా మూడు సమస్యలను ఎదుర్కొంటారు. ఒకటి వ్యాధిని నయం చేసుకునేందుకు తీసుకునే చికిత్స ఖర్చుల భారం. రెండోది ఆ తర్వాత కొనసాగించాల్సిన జీవనశైలి. మూడోది పని చేయలేని పరిస్థితులు ఏర్పడవచ్చు. దీంతో ఖర్చులు తలకు మించిన భారంగానే పరిణమిస్తాయి. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని చూస్తే.. మనకు కచ్చితంగా ఒక సమగ్ర హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అవసరమే. ముఖ్యంగా రీఫిల్ వంటి ఆప్షన్స్ ఉండే పాలసీలను ఎంపిక చేసుకోవాలి. అంటే మీకున్న రూ.10 లక్షల కవరేజీ అయిపోయిన తర్వాత, మళ్లీ అదే మొత్తమో.. అందులో కనీసం సగమో.. అదే ఏడాదే రీస్టోర్ చేసేలా బెనిఫిట్స్ ఉండే పాలసీకి ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే కీమోథెరపీ వంటివి పదేపదే చేయాల్సి ఉంటాయని గమనించండి.
ఇది మార్కెట్లో ఎప్పట్నుంచో అందుబాటులో ఉన్నది. మనం రెగ్యులర్గా తీసుకునే పాలసీకి ఇది యాడ్ ఆన్ కవరేజీ (క్రిటికల్ ఇల్నెస్)లా కూడా లభిస్తుంది. క్యాన్సర్ (లేదా ఏదైనా తీవ్ర అనారోగ్యం) గుర్తించిన వెంటనే మనం చేసే ఖర్చులు, దవాఖాన బిల్లులతో సంబంధం లేకుండా ఒక ఫిక్స్డ్ మొత్తాన్ని మనకు బీమా సంస్థ చెల్లిస్తుంది. అంటే రూ.20 లక్షల పాలసీ తీసుకుంటే.. క్యాన్సర్ను గుర్తించినప్పుడు సదరు మొత్తాన్ని కంపెనీ మనకు చెల్లిస్తుంది. దాన్ని ఇక మన వైద్య అవసరాలకు వినియోగించుకోవచ్చు. రూ.50 లక్షల కవరేజీకి వివిధ బీమా సంస్థలు రూ.5 వేల నుంచి రూ.15 వేలదాకా ప్రీమియంను వార్షికంగా చార్జ్ చేస్తున్నాయి.
సాధారణంగా ఏ చిన్న అనారోగ్యమున్నా బీమా సంస్థలు పాలసీని ఇచ్చేందుకు నిరాకరిస్తాయి. అయితే క్యాన్సర్ వచ్చాక కూడా కొన్ని కంపెనీలు పాలసీలను ఇస్తున్నాయి. వాటిని ఇండెమ్నిటీ బేస్డ్ క్యాన్సర్ ప్లాన్స్ అంటారు. అయితే ఇవి గరిష్ఠంగా రూ.5 లక్షల వరకే పాలసీ కవరేజీని ఇస్తున్నాయి. అసలు ఏ ఇన్సూరెన్స్ కవరేజీలేని వాళ్లకు ఇది కొద్దోగొప్పో ప్రయోజనంగా చెప్పుకోవాలి. రూ.3 లక్షల పాలసీకి బజాజ్ ఫిన్సర్వ్ రూ.850 వరకూ ప్రీమియంను వసూలు చేస్తున్నది. అయితే వీటి కవరేజీకి కూడా చాలా మినహాయింపులుంటాయి.
-నాగేంద్ర సాయి కుందవరం