Infosys | దేశీయ ఐటీ దిగ్గజాల్లో ఒకటైన ఇన్ఫోసిస్ (Infosys) ఇటీవలే తరచూ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. ఉద్యోగులు వారానికి 70 గంటలు పనిచేయాలంటూ ఇటీవలే ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి చేసిన వ్యాఖ్యల నుంచి.. ఉద్యోగులకు లేఆఫ్స్, ఫ్రెషర్స్ విషయంలో సంస్థ తీరు, శాలరీ హైక్లు వంటి కారణాలతో నిత్యం హెడ్లైన్స్లో నిలుస్తోంది. ఇప్పుడు తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది.
కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు క్యాంపస్ (Mysuru Campus) లో శిక్షణ పొందుతున్న దాదాపు 400 మంది ట్రైనీలకు (trainees) సంస్థ లేఆఫ్లు (Layoffs) ఇవ్వడం తీవ్ర వివాదాస్పదమైన విషయం తెలిసిందే. అయితే, తాజాగా ఈ వ్యవహారం ప్రధాన మంత్రి కార్యాలయానికి (PMs Office) చేరినట్లు తెలిసింది. బలవంతపు లేఆఫ్లపై (forceful layoffs) ట్రైనీలు పీఎంవోకు ఫిర్యాదు చేసినట్లు సంబంధిత వర్గాలను ఊటంకిస్తూ జాతీయ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి. ఈ తొలగింపులపై ప్రధానమంత్రి కార్యాలయానికి 100కు పైగా ఫిర్యాదులు అందినట్లు సమాచారం.
ఈ విషయంలో జోక్యం చేసుకొని తమ ఉద్యోగాలు తమకు తిరిగి ఇప్పించాలంటూ ట్రైనీలు కోరినట్లు తెలిసింది. అంతేకాదు, భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా తగిన చర్యలు చేపట్టాలని కోరినట్లు సదరు కథనాలు నివేదిస్తున్నాయి. ఇక ఈ వ్యవహారంపై కేంద్ర కార్మిక శాఖ (labour ministry) కూడా స్పందించినట్లు తెలిసింది. ఈ మేరకు కర్ణాటక కార్మిక శాఖకు ఫిబ్రవరి 25న నోటీసులు పంపినట్లు సదరు కథనాలు పేర్కొన్నాయి. ఈ అంశంపై దర్యాప్తు చేసి కేంద్రానికి నివేదిక అందించాలని నోటీసుల్లో పేర్కొన్నట్లు తెలిసింది.
ట్రైనీలకు ఇన్ఫోసిస్ అల్టిమేటం..!
రెండేళ్ల క్రితం ఫ్రెషర్ల పట్ల కఠిన వైఖరిని ప్రదర్శించిన ఇన్ఫీ.. గతేడాది వారిని విధుల్లోకి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే, అందులోని కొందరు ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. ఫిబ్రవరి 7వ తేదీన కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు (Mysuru) క్యాంపస్లో శిక్షణ పొందుతున్న దాదాపు 400 మంది ట్రైనీలకు (trainees) లేఆఫ్లు (Layoffs) ప్రకటించింది. వరుసగా మూడు సార్లు అంచనా పరీక్షల్లో విఫలమైన కారణంగా వారిని తొలగిస్తున్నట్లు తెలిపింది. ట్రైనీలను 50 మందితో కూడిన బ్యాచ్లుగా పిలిచి వారితో మ్యూచువల్ సెపరేషన్ లెటర్లపై సంతకాలు చేయించుకున్నట్లు వార్తలు వచ్చాయి. సాయంత్రం 6 గంటల్లోపు ట్రైనీలంతా క్యాంపస్ను వీడాలని అల్టిమేటం జారీ చేసింది. అయితే, ట్రైనీల తొలగింపుపై ఇన్ఫీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు. లేఆఫ్లకు గురైన ఉద్యోగులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. లేఆఫ్లకు గురైన ట్రైనీలు తాజాగా ప్రధాని కార్యాలయం తలుపులు తట్టినట్లు తెలుస్తోంది.
Also Read..
Govinda divorce rumours | సునీత ఆరు నెలల క్రితం విడాకులకోసం దరఖాస్తు చేసుకున్నారు : లాయర్