Loans Would Costly | సొంతిల్లు కొనుక్కోవాలని భావించే వారికి ధరల పెరుగుదల ఆందోళనకరమే. ప్రస్తుత సంక్షోభ భరిత వాతావరణంలో సొంతింటి కోసం భారీగా పెట్టుబడి పెట్టాలంటే రుణం తీసుకోవడమే పరిష్కారం. కానీ రోజురోజుకు పెరిగిపోతున్న వివిధ నిత్యావసర వస్తువుల ధరలు.. ఆర్బీఐని ఆందోళనకు గురి చేస్తున్నాయి. సామాన్యుడిపై ధరల పెరుగుదల ప్రభావాన్ని తగ్గించడానికి రెపోరేట్ పెంచకతప్పదని ఆర్బీఐ సంకేతాలిచ్చింది. జూన్లో జరిగే ద్రవ్య పరపతి కమిటీ సమీక్షలో తాజా ద్రవ్యోల్బణం వివరాలు వెల్లడవుతాయన్నారు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్. పెరుగుతున్న ధరలు తమకు అత్యంత ఆందోళనకర అంశం అని ఓ ఆంగ్ల టీవీ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. రెపోరేట్ పెంచితే ఇండ్ల కొనుగోలుకు తీసుకునే బ్యాంకు రుణాలపై వడ్డీరేట్లు పిరం అవుతాయని విశ్లేషకులు అంటున్నారు.
రష్యా, బ్రెజిల్ మినహా ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ నెగెటివ్ వడ్డీరేట్లు అమలవుతున్నాయి. సంపన్న దేశాల్లో ద్రవ్యోల్బణ నియంత్రణ లక్ష్యం సుమారు రెండు శాతం. కానీ జపాన్ మినహా అన్ని సంపన్న దేశాల్లో ద్రవ్యోల్బణం ఏడు శాతానికి పైగానే ఉంది. పెరుగుతున్న ధరల కంటే ఫిక్స్డ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీ ఆదాయం తక్కువ.. దీన్నే నెగెటివ్ వడ్డీరేటు అంటారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 4న జరిగిన అత్యవసర ద్రవ్య పరపతి కమిటీ సమీక్షలో రెపోరేట్ పెంచుతూ ఆర్బీఐ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
ప్రతి రెండు నెలల కోసారి ఆర్బీఐ ద్రవ్యపరపతి కమిటీ సమావేశమవుతుంది. ఏప్రిల్ 6-8 మధ్య తొలి సమీక్ష జరిగింది. వచ్చే నెలలో మరో ద్వైమాస సమీక్ష ఉంటుంది. అయితే, ఏప్రిల్ ద్రవ్యోల్బణం ఆల్టైం రికార్డు నెలకొల్పడంతో 2020 మే 22 తర్వాత తొలిసారి ఆర్బీఐ రెపోరేట్ 40 బేసిక్ పాయింట్లు పెంచేసింది. అప్పటి వరకు ఆర్బీఐ రెపోరేట్ కేవలం నాలుగు శాతమే.