న్యూఢిల్లీ: బంగారం అన్నా.. బంగారం ఆభరణాలన్నా భారతీయ మహిళలకు ఎంతో ఇష్టం.. పెండ్లిండ్లు తదితర శుభ కార్యాల్లో తమకు ఇష్టమైన ఆభరణాలను ధరించడానికే మొగ్గు చూపుతారు. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో డిమాండ్ భారీగా పెరిగింది. 2020-21 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది జూన్ త్రైమాసికంలో 19 శాతం గిరాకీ ఎక్కువైంది. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 76 టన్నుల బంగారాన్ని ఇండియన్లు కొనుగోలు చేశారని ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) తెలిపింది.
కానీ గతేడాది ప్రపంచాన్ని వణికించిన కోవిడ్-19ను నియంత్రించడానికి దేశవ్యాప్తంగా విధించిన లాక్డౌన్ ప్రభావం దేశీయ ఆర్థిక వ్యవస్థను కుదేలు చేసింది. తదనుగుణంగా బంగారం కొనుగోళ్లపైనా భారీగా ప్రతికూల ప్రభావం పడింది.
గత ఆర్థిక సంవత్సరం ద్వితీయ త్రైమాసికంలో ఓవరాల్గా బంగారానికి డిమాండ్ పెరిగి 63.8 టన్నులకు చేరుకున్నది. విలువ పరంగా బంగారం కొనుగోళ్లలో 23 శాతం పురోగతి నమోదైంది. 2020-21 తొలి త్రైమాసికంలో రూ.26,600 కోట్ల విలువైన బంగారం కొనుగోళ్లు జరిగితే ఈ ఏడాది రూ.32,810 కోట్లకు పెరిగింది.
అయితే, గతేడాది దేశాన్ని అతలాకుతలం చేసిన కరోనా రెండో వేవ్లో బంగారం డిమాండ్ 46 శాతం పడిపోయింది. తొలి అర్థభాగంలో డిమాండ్ 157.6 టన్నులకు చేరుకుంది. 2019 తొలి అర్థ భాగంతో పోలిస్తే 46 శాతం తక్కువ. 2015-19 మధ్య ఐదేండ్లలో తొలి అర్థభాగంలో బంగారానికి డిమాండ్ 39 శాతం పడిపోయిందని డబ్ల్యూజీసీ పేర్కొంది.
2020-21 ద్వితీయ త్రైమాసికంలో కరోనా రెండో వేవ్ భారీగా ప్రభావం చూపింది. 2020-21లో విధించిన లాక్డౌన్తో పోలిస్తే ఆశ్చర్యకరమైన రీతిలో బంగారానికి డిమాండ్ పెరిగింది. 2021 సెకండ్ క్వార్టర్తో పోలిస్తే 2020 రెండో త్రైమాసికంలో 19.2 శాతం బంగారానికి గిరాకీ ఎక్కువైందని డబ్ల్యూజీసీ ఇండియా ఎండీ సీఈవో సోమసుందరం చెప్పారు. కానీ అక్షయ త్రుతీయ, వివాహాల సీజన్లోనూ డిమాండ్ పడిపోయిందన్నారు.