న్యూఢిల్లీ, నవంబర్ 30: దేశ జీడీపీ వృద్ధి ఈ ఆర్థిక సంవత్సరం (2021-22) రెండో త్రైమాసికం (క్యూ2 లేదా జూలై-సెప్టెంబర్)లో 8.4 శాతంగా నమోదైంది. ఈ మేరకు మంగళవారం జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్వో) వెల్లడించింది. కరోనాకు ముందున్న స్థాయి కంటే ఇది ఎక్కువని పేర్కొన్నది. విలువ ఆధారంగా ఈసారి జీడీపీ రూ.35,73,451 కోట్లుగా ఉండగా, 2019-20 క్యూ2లో రూ.35,61,5 30 కోట్లుగా ఉన్నది. దీంతో ఈ ప్రథమార్ధం (ఏప్రిల్-సెప్టెంబర్)లో జీడీపీ విలువ రూ.68.11 లక్షల కోట్లకు చేరింది. అయితే గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో కరోనా కారణంగా పడిపోయిన వృద్ధిరేటే ఈ జోష్కు కారణం. లాక్డౌన్ నేపథ్యంలో నిరుడు జూలై-సెప్టెంబర్లో మైనస్ 7.4 శాతంగా జీడీపీ ఉన్నది. దాంతో పోల్చితే ఈసారి 8.4 శాతం వృద్ధి నమోదైంది. కాగా, ఈ ఏప్రిల్-జూన్ త్రైమాసికంలోనూ 20.1 శాతం వృద్ధి నమోదైన విషయం తెలిసిందే. గతేడాది ఇదే కాలంలో మైనస్ 24.4 శాతంగా ఉన్నది. ఇదిలావుంటే ఈ క్యూ2లో తయారీ రంగం వృద్ధి 5.5 శాతానికి ఎగిసింది. నిరుడు మైనస్ 1.5 శాతంలో ఉన్నది. అలాగే గతంతో చూస్తే వ్యవసాయ రంగం మైనస్ 3 శాతం నుంచి 4.5 శాతానికి, నిర్మాణ రంగం మైనస్ 7.2 శాతం నుంచి 7.5 శాతానికి, గనుల రంగం మైనస్ 6.5 శాతం నుంచి 15.4 శాతానికి, విద్యుత్తు, గ్యాస్, నీటీ సరఫరా ఇతర యుటిలిటీ సేవలు మైనస్ 2.3 శాతం నుంచి 8.9 శాతం మేర పుంజుకున్నాయి. వాణిజ్యం, ఆతిథ్య, రవాణా, సమాచార, ప్రసారాల సేవలూ మైనస్ 16.1 శాతం నుంచి 8.2 శాతానికి ఎగిశాయి. ఫైనాన్షియల్, రియల్ ఎస్టేట్, ప్రొఫెషనల్ సర్వీసుల వృద్ధి సైతం మైనస్ 9.1 శాతం నుంచి 7.8 శాతానికి ఎగబాకింది. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, రక్షణ, ఇతరత్రా సేవలు మైనస్ 9.2 శాతం నుంచి 17.4 శాతానికి పెరిగాయి.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అంచనాలో కేంద్ర ప్రభుత్వ ద్రవ్యలోటు ఈ అక్టోబర్ ఆఖరు నాటికి రూ.5.47 లక్షల కోట్లుగా (36.3 శాతం) ఉన్నది. ఈ మేరకు మంగళవారం కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (సీజీఏ) తెలియజేసింది. పుంజుకున్న ఆదాయ వనరులతో గతేడాదితో పోల్చితే ఈసారి ద్రవ్యలోటు మెరుగుపడిందని పేర్కొన్నది. ప్రభుత్వ ఖర్చులు, ఆదాయానికి మధ్య ఉన్న తేడానే ఈ ద్రవ్యలోటు. కరోనా ప్రభావం, తదనంతర పరిస్థితుల మధ్య గత ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అంచనాలో అక్టోబర్ నాటికే ద్రవ్యలోటు 119.7 శాతంగా నమోదైంది. కాగా, ఈ ఆర్థిక సంవత్సరానికిగాను ద్రవ్యలోటును రూ.15.06 లక్షల కోట్లుగా లేదా జీడీపీలో 6.8 శాతంగా బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది. ఈ క్రమంలోనే అక్టోబర్ 31 నాటికి రూ.5,47,026 కోట్లుగా ఉందని సీజీఏ తెలిపింది.
ఎనిమిది కీలక రంగాల్లో వృద్ధిరేటు అక్టోబర్లో 7.5 శాతంగా నమోదైంది. బొగ్గు, సహజ వాయువు, రిఫైనరీ ఉత్పత్తులు, సిమెంట్ రంగాల పనితీరు ఆకర్షణీయంగా ఉన్నదని మంగళవారం కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. ముడి చమురు, ఎరువులు, ఉక్కు, విద్యుత్తులతో కూడిన ఈ మౌలిక రంగాల వృద్ధిరేటు నిరుడు అక్టోబర్లో మైనస్ 0.5 శాతంగా నమోదైంది. ఈ ఏడాది సెప్టెంబర్లో 4.5 శాతంగా ఉన్న మౌలిక రంగాభివృద్ధి.. ఏప్రిల్-అక్టోబర్లో 15.1 శాతంతో కనిపిస్తున్నది. గతేడాది ఇది మైనస్ 12.6 శాతంగా ఉన్నది. కాగా, దేశీయ పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ)లో ఈ ఎనిమిది కీలక రంగాల వాటా 40.27 శాతంగా ఉండటం గమనార్హం.
‘ఈ ఆర్థిక సంవత్సరం దేశ జీడీపీ రెండంకెల వృద్ధిరేటును సాధించే అవకాశాలున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరం 6.5-7 శాతంగా, ఆపై ఆర్థిక సంవత్సరం 7 శాతంగా నమోదు కావచ్చు. ఈసారి జీడీపీలో ద్రవ్యలోటుకు సంబంధించి పెట్టుకున్న 6.8 శాతం లక్ష్యాన్ని కూడా చేధించే వీలున్నది’
–కేవీ సుబ్రమణ్యన్, ప్రధాన ఆర్థిక సలహాదారు