GDP | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 29: డిసెంబర్తో ముగిసిన మూడవ త్రైమాసికంలో భారత్ ఆర్థికాభివృద్ధి అందరి అంచనాల్ని మించిపోయింది. గురువారం నేషనల్ స్టాటస్టికల్ ఆఫీస్ (ఎన్ఎస్వో) విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2023-24 ఆర్థిక సంవత్సరం అక్టోబర్-డిసెంబర్ మధ్యకాలంలో స్థూల జాతీయ ఉత్పత్తి (జీడీపీ) 8.4 శాతం వృద్ధిచెందింది. తయారీ రంగం రెండంకెల్లో వృద్ధిచెందడం, మైనింగ్, నిర్మాణ రంగాలు మంచి పనితీరును కనపర్చడంతో ఈ వృద్ధి రేటు సాధ్యపడింది.
ఇదే కాలంలో జీడీపీ 6.5 శాతం వృద్ధిచెందవచ్చని స్వయానా రిజర్వ్బ్యాంక్ గత అంచనాల్లో ప్రకటించగా, వివిధ ఆర్థిక నిపుణులు, రేటింగ్ ఏజెన్సీలు ఈ వృద్ధి 6-7.2 శాతం మధ్య ఉంటుందని అంచనాల్ని వెల్లడించారు. అంతకు ముందు జూలై-సెప్టెంబర్లో (క్యూ2) వృద్ధిని 7.6 శాతం నుంచి 8.1 శాతానికి, ఏప్రిల్-జూన్ (క్యూ1)లో వృద్ధి రేటును 7.8 శాతం నుంచి 8.2 శాతానికి తాజాగా ఎన్ఎస్వో సవరించింది. తయారీ రంగం మందగించడం, వినియోగంతగ్గడంవల్ల క్యూ3లో ఆర్థికాభివృద్ధి రేటు 7 శాతంలోపునకు పడిపోతుందని రాయిటర్స్ సర్వేలో విశ్లేషకులు అభిప్రాయపడగా, అందుకు భిన్నమైన గణాంకాలు వెలువడటం గమనార్హం.
ప్రస్తుత 2023-24 పూర్తి ఆర్థిక సంవత్సరానికి వృద్ధి అంచనాల్ని ఎన్ఎస్వో 7 శాతం నుంచి 7.6 శాతానికి పెంచింది. ఇది 2011-12 స్థిర ధరల ప్రకారం రూ.172.90 లక్షల కోట్లు. 2022-23 సంవత్సరంలో సవరించిన అంచనాల ప్రకారం వాస్తవ జీడీపీ రూ.160.71 లక్షల కోట్లు. ఈ అంచనా గణాంకాలకు అనుగుణంగా 2023-24లో వృద్ధి 7.6 శాతం పెరుగుతున్నట్టవుతుందని ఎన్ఎస్వో వివరించింది. 2022-23లో ఇది 7 శాతంగా ఉంది. ఇక ప్రస్తుత ధరల ప్రకారం 2023-24 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ రూ.293.90 లక్షల కోట్లకు చేరుతుందని ఎన్ఎస్వో అంచనా వేసింది.
2022-23లో ఇది రూ.269.50 లక్షల కోట్లుగా ఉంది. ఈ ధరల ప్రకారం జీడీపీ 9.1 శాతం వృద్ధి రేటును ప్రదర్శిస్తుంది. క్యూ 3లో స్థిర ధరల (2011-12) మేరకు జీడీపీ రూ.43.72 లక్షల కోట్లుకాగా, 2022-23 అక్టోబర్-డిసెంబర్లో నమోదైన 40.35 లక్షల కోట్లతో పోలిస్తే 8.4 శాతం వృద్ధి నమోదైనట్టు. ప్రస్తుత ధరల ప్రకారం క్యూ3 జీడీపీ రూ.75.49 లక్షల కోట్లుకాగా, 2022 -23 క్యూ3 లో నమోదైన రూ.68.58 లక్షల కోట్లకంటే ఇది 10.1 శాతం అధికం.