న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. ఫెడరల్ రిజర్వుతోపాటు ఒకేసారి పలు సెంట్రల్ బ్యాంక్లు వడ్డీరేట్లను పెంచుతూ తీసుకున్న నిర్ణయం మదుపరుల్లో ఆందోళన పెంచింది. ఫలితంగా వరుసగా మూడోరోజు సూచీలు భీకరనష్టాల్లోకి జారుకున్నాయి. 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ ఏకంగా వెయ్యి పాయింట్లకు పైగా నష్టపోయి 58 వేల పాయింట్ల స్థాయికి జారుకున్నది. రూపాయి మారకం విలువ 81 స్థాయికి జారుకోవడం కూడా మార్కెట్ల పతనానికి ఆజ్యంపోసింది.
వారాంతం ట్రేడింగ్ ముగిసే సరికి సెన్సెక్స్ 1,020.80 పాయింట్లు లేదా 1.73 శాతం నష్టపోయి 58,098.92 వద్ద నిలిచింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా 302.45 పాయింట్లు(1.72 శాతం) తగ్గి 17,327.35 వద్ద ముగిసింది. దీంతో రూ.5 లక్షల కోట్ల వరకు మదుపరుల సంపదను కోల్పోయారు. బీఎస్ఈలో లిైస్టెన సంస్థల విలువు ఒకేరోజు రూ.4,90,162.55 కోట్లు కరిగిపోయి రూ.2,76,64,566.79 కోట్లకు పరిమితమైంది. గత మూడు సెషన్లలో సెన్సెక్స్ 1,621 పాయింట్లు నష్టపోవడంతో మదుపరులు రూ.6.77 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు.