న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో ఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం నుంచి కార్యాలయాల బాట పడుతున్నారు. గత మూడేండ్లుగా ఐటీ ఉద్యోగులు ఇండ్ల నుంచే పనిచేస్తుండగా ఇక ఇంటి నుంచి పనిచేసే కల్చర్కు తెరపడుతోంది. ఉద్యోగులంతా ఆఫీస్లకు తిరిగి రావాలని, ఆఫీసులకు రాని వారు కెరీర్ అవకాశాలను కోల్పోతారని తాజాగా ఐబీఎం (IBM) సీఈవో అరవింద్ కృష్ణ ఉద్యోగులను హెచ్చరించారు.
టీంలను నడిపించాలని కోరుకునే వారు మేనేజర్ల పొజిషన్కు చేరుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారని స్పష్టం చేశారు. రిమోట్ వర్కింగ్ ఉద్యోగుల కెరీర్ ఎదుగుదలను దెబ్బతీస్తుందని పేర్కొన్నారు. నాయకులుగా ఎదగాలనుకునే వారు ఆఫీస్ నుంచే పనిచేయాలని, రిమోట్ వర్కింగ్ ఉద్యోగుల వృద్ధికి ఆటంకమని స్పష్టం చేశారు. లీడర్ తన టీం సభ్యులను సంప్రదించాల్సి ఉంటుందని, వారు ఎక్కడో కూర్చుని పనిచేస్తే టీంను నడిపించడం కష్టమని పేర్కొన్నారు.
ముఖాముఖి సంప్రదింపులు కీలకమని స్పస్టం చేశారు. టీం సభ్యులను నిరంతరం స్వయంగా పర్యవేక్షించకున్నా కొన్ని సార్లు వారితో ముఖాముఖి సంప్రదింపులు అనివార్యమని అన్నారు. మన మంతా టీంగా సమిష్టిగా పనిచేస్తేనే మెరుగైన ఫలితాలు ఉంటాయని కంపెనీ రిటన్ టూ ఆఫీస్ పాలసీని ప్రస్తావిస్తూ పేర్కొన్నారు. ఉద్యోగులను కార్యాలయాలకు రావడానికి తాము ప్రోత్సహిస్తామని అరవింద్ కృష్ణ స్పష్టం చేశారు.
Read More
ChatGpt | ఏఐ ముప్పుపై చర్చించేందుకు కమలా హ్యారిస్తో టెక్ దిగ్గజాల భేటీ