న్యూఢిల్లీ, డిసెంబర్ 21: దేశవ్యాప్తంగా మొత్తం గృహ రుణాల్లో మిల్లీనియల్స్, జెన్-జెడ్ గ్రూప్ (18-34 ఏండ్లవారు) వాటా 53 శాతంగా ఉన్నట్టు తాజాగా విడుదల చేసిన ఓ నివేదికలో ప్రముఖ రియల్టీ పోర్టల్ మ్యాజిక్బ్రిక్స్ వెల్లడించింది. అయితే వీరిలో 74 శాతం పురుషులు, 26 శాతం మహిళలున్నట్టు చెప్పింది.
ఇక గృహ రుణాల్లో 58 శాతం రూ.40 లక్షలదాకా ఉన్న లోన్లే ఉన్నాయి. గురుగ్రామ్ రుణగ్రహీతల్లో 25 శాతం మంది రూ.40-60 లక్షల శ్రేణి లోన్లు తీసుకున్నారు. హోమ్ లోన్లలో కోటి రూపాయలు, కోటిన్నర లోన్ల వాటా 13 శాతంగా ఉన్నది. కాగా, మొత్తం గృహ రుణాల్లో 80 శాతం ప్రథమ శ్రేణి నగరాలవే. ఇందులో 22 శాతంతో ముంబై ముందున్నది. బెంగళూరు (19 శాతం), నోయిడా (17 శాతం) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
స్థిరమైన వడ్డీరేట్లు
గత కొంతకాలంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక వడ్డీరేట్లను యథాతథంగానే ఉంచుతుండటంతో.. బ్యాంకులు సైతం గృహ రుణాలపై వడ్డీరేట్ల జోలికి వెళ్లడం లేదు. ఈ రకమైన స్థిరత్వాన్ని చూసే మిల్లీనియల్స్, జెన్-జెడ్ గ్రూప్ వయస్కులు ఇండ్ల కొనుగోళ్లకు ముందుకొస్తున్నారని మ్యాజిక్బ్రిక్స్ తెలిపింది. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు సైతం ఆకర్షణీయంగా మారడం కలిసొచ్చిందని అభిప్రాయపడింది. దీంతో రాబోయే రోజుల్లోనూ ఇదే ట్రెండ్ కొనసాగవచ్చని మ్యాజిక్బ్రిక్స్ వ్యాపారాధిపతి (హోమ్ లోన్స్) నిమేశ్ భండారీ అన్నారు.
ఆ మూడు నగరాలదే హవా
ప్రాపర్టీలను కొనేవారు అన్వేషిస్తున్న దేశీయ నగరాల్లో ముంబై మెట్రోపాలిటన్ రీజియన్, బెంగళూరు, ఢిల్లీ-ఎన్సీఆర్ ముందు వరుసలో ఉన్నట్టు మ్యాజిక్బ్రిక్స్ తెలిపింది. ముంబై-ఎంఆర్ 20 శాతంతో అగ్రస్థానంలో ఉండగా, 19 శాతంతో బెంగళూరు, ఢిల్లీ-ఎన్సీఆర్ రెండో స్థానంలో సంయుక్తంగా నిలిచాయి. ఈ ఏడాది తమ వేదికపై దేశవ్యాప్తంగా కస్టమర్లు సెర్చ్ చేసిన వివరాల ప్రకారం ఈ మేరకు మ్యాజిక్బ్రిక్స్ వెల్లడించింది. ఇదిలావుంటే ఇండ్ల కొనుగోలుకు వీలున్నవారిలో 80 శాతం మంది అపార్ట్మెంట్లలోనే ఫ్లాట్లు కొనాలని చూస్తున్నట్టు తేలింది.
అలాగే 56 శాతం మంది 3బీహెచ్కే, ఆపై ఇండ్ల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారని మ్యాజిక్బ్రిక్స్ రిసెర్చ్ అధిపతి అభిషేక్ భద్రా తెలిపారు. ఇక అహ్మదాబాద్, కోల్కతాల్లో సరసమైన ధరలకు లభించే గృహాల మార్కెట్ మూడు రెట్లు పెరిగిందని, ముంబై-ఎంఆర్లో ఇది 63 శాతం, ఢిల్లీ-ఎన్సీఆర్లో 34 శాతం వృద్ధిని కనబర్చినట్టు స్పష్టమైంది. ఇదిలావుంటే భారతీయ రియల్ ఎస్టేట్లో పెట్టుబడులను పెట్టేందుకు విదేశీ మదుపరులు జంకు తున్నారు. ఈ ఏడాది మొదలు ఈ నెల 12 దాకా వచ్చిన పెట్టుబడులు 44 శాతం తగ్గడ మే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నది.