సిటీబ్యూరో, జనవరి 3: హైదరాబాద్లో ఇండ్ల అమ్మకాలు జోరందుకున్నాయి. రియల్ ఎస్టేట్ మార్కెట్లో చరిత్ర సృష్టించిన భాగ్యనగరంలో గతేడాది అమ్మకాలు అంచనాలకుమించి వృద్ధిని నమోదుచేసుకున్నాయి. ఒకవైపు కరోనా విపత్తు వెంటాడుతున్నా నగరంలో ఇండ్ల అమ్మకాలు, కొత్త ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు ఊహించిన దానికంటే ఎక్కువగా నమోదయ్యాయని ప్రముఖ రియల్ ఎస్టేట్ మార్కెట్ విశ్లేషణ సంస్థ అనరాక్ తాజా వార్షిక నివేదికలో వెల్లడించింది. దేశంలోని ఏడు ప్రధాన నగరాలకు సంబందించిన ఇళ్ల అమ్మకాలు, కొత్త ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలపై నివేదికను విడుదల చేసింది. 2020 ఏడాదిలో జరిగిన అమ్మకాలతో పోలిస్తే 2021లో గృహ విక్రయాలు 71 శాతం పెరిగాయి. 2020లో మొత్తం యూనిట్లు 1,38,350 ఉండగా, 2021లో 2,36, 530 యూనిట్లుగా నమోదయ్యాయి. కాగా 2019తో పోలిస్తే 10 శాతం తగ్గిందని అనరాక్ పేర్కొంది. ఇందులో హైదరాబాద్ మహానగరంలో 2020లో 8,560 యూనిట్లు అమ్ముడవగా.. గతేడాది మూడు రెట్లు పెరిగి 25,410లకు చేరుకున్నాయి. అదేవిధంగా కొత్త ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు 2020లో 21,110 యూనిట్లు ఉంటే, ఆ తర్వాతి ఏడాదిలో 51,470 యూనిట్లకు చేరాయి.
తక్కువ వడ్డీకే గృహ రుణాలు
తక్కువ వడ్డీకే గృహ రుణాలు బ్యాంకులు అందిస్తుండటంతో అమ్మకాలు భారీగా పెరుగడానికి ప్రధాన కారణమని అనరాక్ విశ్లేషించింది. బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐతోపాటు ఇతర బ్యాంకులు కూడా తక్కువ వడ్డీకే రుణాలు ఇవ్వడం, పండుగ సీజన్లో ప్రాసెసింగ్, ఇతర ఫీజులను ఎత్తివేయడం కూడా కలిసొచ్చింది. సొంతిళ్ళు కావాలన్న ఆకాంక్ష పెరగడం, పలు రాష్ట్ర ప్రభుత్వాలు స్టాంప్ డ్యూటీలు తగ్గించడం, బిల్డర్లు అందించే రాయితీలు వంటివి గృహ అమ్మకాలు పెరుగడానికి ప్రధాన కారణమని వెల్లడించింది.