గ్రామాల్లో కొనసాగుతున్న స్వచ్ఛంద లాక్డౌన్
నిబంధనలు అతిక్రమించిన వారికి జరిమానా
చిగురుమామిడి, మే 4: కరోనా సెకండ్ వేవ్ కేసులను తగ్గుముఖం పట్టించేందుకు గాను మండలంలోని రేకొండ గ్రామ పంచాయతీ పాలకవర్గం మంగళవారం అత్యవసర సమావేశం సర్పంచ్ పిట్టల రజిత అధ్యక్షతన నిర్వహించారు. గ్రామంలో 15 రోజుల పాటు సెల్ఫ్ లాక్డౌన్ అమలు చేయాలని, వ్యాపార సంస్థలు ఉదయం 6 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి 8 గంటల వరకు తీయాలని సూచించారు. గ్రామంలోని బెల్టుషాపులు మూసివేయాలని, ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలన్నారు. గ్రామంలో హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేయించాలని తీర్మానించారు. లాక్డౌన్ నుంచి రైతుల ధాన్యం కొనుగోళ్లుతో పాటు మెడికల్షాపులను మినహాయించారు. ఈ సమావేశంలో పంచాయతీ కార్యదర్శి లావణ్య, ఉప సర్పంచ్ చాడ మహిపాల్రెడ్డి, వార్డు సభ్యులు ప్రవీణ్, రజిత, రేణుక, వనజ, కారోబార్ రాజ్కుమార్, వార్డు సభ్యులు ఉన్నారు. ఇటీవల కరోనాతో మృతి చెందినవారికి పాలకవర్గం సంతాపం వ్యక్తం చేశారు.
చెంజర్ల, పచ్చునూర్ గ్రామాల్లో ..
మానకొండూర్ రూరల్, మే 4: కొవిడ్ వైరస్ వ్యాప్తి నియంత్రణకు చెంజర్ల, పచ్చునూర్ గ్రామాల్లో స్వచ్ఛంద లాక్డౌన్ను ప్రకటించుకున్నారు. మంగళవారం చెంజర్లలో ఆరో రోజు, పచ్చునూర్లో మూడో కిరాణా, మెడికల్ షాపులకు మినహాయించి మిగిలిన షాపులు పూర్తిగా మూసివేశారు. లాక్డౌన్కి సహరిస్తున్న వారికి సర్పంచులు బొల్ల వేణు, నర్మట వసంత కృతజ్ఞతలు తెలిపారు.
గన్నేరువరంలో..
గన్నేరువరం, మే 4: కరోనా నియంత్రణలో భాగంగా మండల కేంద్రంలో వ్యాపారస్తులు సెల్ఫ్ లాక్డౌన్ పాటిస్తున్నారు. ఉదయం 6 నుంచి 10 గంటల వరకే దుకాణాలు తెరిచి ఉంచుతున్నారు. ప్రతి ఒక్కరూ విధిగా మాస్కు ధరించాలని, అత్యవసరమైతేనే ఇంటి నుంచి బయటకు రావాలని, భౌతిక దూరం పాటించాలని సర్పంచ్ పుల్లెల లక్ష్మీలక్ష్మణ్ గ్రామస్తులకు సూచించారు.
రామకృష్ణకాలనీలో..
తిమ్మాపూర్ రూరల్, మే 4: కరోనా కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో.. గ్రామాల్లో సగం పూట లాక్డౌన్లను పెట్టుకుంటున్నారు. ఇప్పటికే నుస్తులాపూర్, మహాత్మానగర్ గ్రామాల్లో మధ్యాహ్నం నుంచి లాక్డౌన్ నిర్వహిస్తుండగా.. తాజాగా రామకృష్ణకాలనీలో నేటి నుంచి లాక్డౌన్ విధిస్తున్నట్టు తెలిపారు. మధ్యాహ్నం 12 గంటల వరకే దుకాణాలు, హోటళ్లు తెరిచి ఉంచాలని సర్పంచ్ మీసాల అంజయ్య స్పష్టం చేశారు. పంచాయతీ నిర్ణయాన్ని అతిక్రమిస్తే జరిమానాలు విధిస్తామని పేర్కొన్నారు. ప్రజలు మాస్కులు ధరించాలని సూచించారు.