HCL Tech : ఫిబ్రవరి 19 నుంచి ఉద్యోగులు వారానికి మూడు రోజులు కార్యాలయాల నుంచి పనిచేయాలని దేశీ ఐటీ కంపెనీ హెచ్సీఎల్ టెక్నాలజీస్ స్పష్టం చేసింది. ఈ నిబంధనను పాటించని వారిని గైర్హాజరుగా పరిగణించడంతో పాటు క్రమశిక్షణా చర్యలు ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరించింది.
టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో వంటి ఐటీ దిగ్గజాలు ఇప్పటికే ఉద్యోగులు విధిగా కార్యాలయాలకు హాజరు కావాలని, వారానికి కనీసం మూడు రోజుల పాటు ఆఫీస్ల నుంచి పనిచేయని పక్షంలో చర్యలు తప్పవని తేల్చిచెప్పాయి. కంపెనీ ఉద్యోగులు తమ స్ధాయితో నిమిత్తం లేకుండా ఆయా కార్యాలయాల్లో వారానికి కనీసం మూడు రోజులు పనిచేయాలని ఫిబ్రవరి 14న హెచ్సీఎల్ టెక్ గ్లోబల్ హెడ్ (పీపుల్ ఫంక్షన్) వికాస్ శర్మ ఉద్యోగులకు అందించిన అంతర్గత సమాచారంలో పేర్కొన్నారు.
హెచ్సీఎల్ ఆఫీస్, రిమోట్ వర్కింగ్లతో కూడిన హైబ్రిడ్ వర్క్ మోడల్ను అనుసరిస్తోందని హెచ్సీఎల్ టెక్ ప్రతినిధి స్పష్టం చేశారు. మరోవైపు తమ పనితీరును ప్రతిక్షణం పర్యవేక్షిస్తున్నారని, మేనేజర్లు తమ ల్యాప్టాప్ యాక్టివిటీని నిశితంగా స్క్రూటినీ చేస్తున్నారని ఉద్యోగులు వాపోతున్నారు. కఠిన నిబంధనలకు భిన్నంగా వ్యవహరిస్తే క్రమశిక్షణా చర్యలకు తెగబడుతుండటం ఉద్యోగుల్లో గుబులు రేపుతోంది. ఇక ఫిబ్రవరి 19 నుంచి అమలు కానున్న నూతన విధానం డిజిటల్ ఫౌండేషన్ సర్వీసెస్ ఉద్యోగులందరికీ వర్తిస్తుందని హెచ్సీఎల్ వెల్లడించింది.
Read More :
Surgical Robot | ప్రాణాలు తీసిన సర్జికల్ రోబో..! కోర్టుకెక్కిన బాధిత కుటుంబం..!