న్యూఢిల్లీ : ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ ప్రయత్నాలు ఈసారి ఫలప్రదమవుతాయని, నిర్ధిష్ట సమయానికి ఈ ప్రక్రియ పురోగతి సాగుతోందని పౌరవిమానయాన మంత్రి హర్దీప్ సింగ్ పూరి పేర్కొన్నారు. గతంలో ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణపై అన్యమనస్కంగా ప్రయత్నాలు సాగాయని, ఈసారి ప్రైవేటీకరణ లేదా ఎయిర్లైన్ మూసివేత మినహా మరో ప్రత్యామ్నాయం లేదని ఆయన స్పష్టం చేశారు.
టైమ్స్ నెట్వర్క్ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన ఓ సదస్సులో మంత్రి మాట్లాడుతూ ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణలో ఈసారి ప్రభుత్వం విఫలమైతే రోజుకు రూ 20 కోట్ల నష్టంతో నడుస్తున్న ఎయిర్లైన్ను కొనసాగించడం అర్ధరహితమని అన్నారు. 2018లో ఎయిర్ ఇండియాను కొనుగోలు చేసేందుకు ఏ ఒక్క బిడ్డర్ ముందుకు రాలేదు. ఆపై కొవిడ్-19 వ్యాప్తితో ఈ ప్రక్రియ ముందుకు సాగలేదు. వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి ఎయిర్లైన్ ప్రైవేటీకరణ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం కసరత్తు సాగిస్తోంది. ఎయిర్ ఇండియాను దక్కించుకునేందుకు ప్రధానంగా టాటా గ్రూప్, స్పైస్జెట్లు రేస్లో ఉన్నాయి.