దేశీయ స్టాక్ మార్కెట్లపై ఈ వారం కూడా గల్ఫ్ పరిణామాల ప్రభావమే ప్రధానంగా కనిపించనున్నది. అమెరికా-ఇరాన్ల తీరు.. మదుపర్లను కొనుగోళ్లు, అమ్మకాల మధ్య ఊగిసలాడేలా చేస్తున్నది. తీవ్ర ఒడిదుడుకుల మధ్య గత వారం సెన్సెక్స్ 414.69 పాయింట్లు లేదా 0.53 శాతం పెరిగి 77,328.19 దగ్గర నిలిచింది. నిఫ్టీ 178.60 పాయింట్లు లేదా 0.74 శాతం పుంజుకొని 24,176.15 వద్ద స్థిరపడింది. కాగా, అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ యు ద్ధం ఆగే దిశగా అడుగులు పడితే మార్కెట్లు పుంజుకోవచ్చు. అయితే ట్రంప్.. ఈ విషయంలో వెనక్కి తగ్గినట్టే తగ్గి మళ్లీ దుందుడుకు వైఖరిని ప్రదర్శిస్తుండటం, ఇరాన్ కూడా అదే రీతిలో స్పందిస్తుండటం.. శాంతి ఒప్పందానికి అవరోధాలుగా నిలుస్తున్నాయి. ఇరువైపులా సైనిక చర్యలకు సిద్ధమవుతుండటంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు మళ్లీ విజృంభిస్తున్నాయి.
దీంతో అమ్మకాల ఒత్తిడికి ఆస్కారం లేకపోలేదు. ఇక జనవరి-మార్చికిగాను ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలు ప్రకటించే ఆర్థిక ఫలితాల ప్రభావం సైతం మార్కెట్ ట్రేడింగ్పై గట్టిగానే ఉండనున్నది. అలాగే గ్లోబల్ స్టాక్ మార్కెట్ల తీరుతెన్నులు, డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ, విదేశీ మదుపర్ల పెట్టుబడులూ ప్రధానమే. కాగా, అమ్మకాల ఒత్తిడి కనిపిస్తే నిఫ్టీకి 23,800 పాయింట్ల స్థాయి కీలకమైనదనుకోవచ్చు. దీనికి దిగువన ముగిస్తే 23,500 పాయింట్ల స్థాయిని మద్దతుగా చెప్పుకోవచ్చని అత్యధిక నిపుణుల మాట. సూచీలు పరుగందుకుంటే ఈ వారం నిఫ్టీ 24,400-24,700 పాయింట్ల స్థాయికి వెళ్లవచ్చనీ చెప్తున్నారు.
గమనిక: స్టాక్ మార్కెట్ పెట్టుబడులు రిస్క్తో కూడుకున్నవి. వివిధ దేశ, విదేశీ పరిణామాలు ట్రేడింగ్ను ఎక్కువగా ప్రభావితం చేస్తుంటాయి. కాబట్టి ఇక్కడ ఒడిదుడుకులు చాలా సహజం. పెట్టుబడులు పెట్టే ముందు ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం, ఆయా సాధనాల డాక్యుమెంట్లను క్షుణ్ణంగా చదువుకోవడం ఉత్తమం. అలాగే పైన పేర్కొన్న సూచనలు విశ్లేషకుల అభిప్రాయం మాత్రమే. దీనికి మా పత్రిక ఎటువంటి బాధ్యత వహించదు. ఎవరి పెట్టుబడులకు వారిదే పూర్తి బాధ్యత. అవగాహన కోసమే ఈ మార్కెట్ పల్స్.