న్యూఢిల్లీ, జూన్ 1: జీఎస్టీ వసూళ్లు మరింత పెరిగాయి. గత నెలకుగాను రూ.1.57 లక్షల కోట్ల మేర వసూలయ్యాయి. అంతక్రితం ఏడాది ఇదే నెలలో వసూలైన రూ.1.41 లక్షల కోట్లతో పోలిస్తే 12 శాతం పెరిగినట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. రూ.1.5 లక్షల కోట్ల కంటే అధికంగా నమోదుకావడం ఇది ఐదోసారి. మే నెలలో వసూలైన రూ.1,57,090 కోట్లలో సెంట్రల్ జీఎస్టీ కింద రూ.28,411 కోట్లు, స్టేట్ జీఎస్టీ కింద రూ.35,828 కోట్లు, ఐజీఎస్టీ కింద రూ.81,363 కోట్లు, సెస్ రూపంలో రూ.11,489 కోట్లు వసూలయ్యాయి.
తెలంగాణలో 4,507 కోట్లు
తెలంగాణ రాష్ట్రంలో రూ.4,507 కోట్ల జీఎస్టీ వసూలైంది. ఏడాది క్రితం ఇదే నెలలో వసూలైన రూ.3,982 కోట్ల కంటే ఇది 13 శాతం అధికం. జీఎస్టీ అమలులోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో పన్ను వసూళ్లు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి.