న్యూఢిల్లీ, డిసెంబర్ 1: జీఎస్టీ వసూళ్లు క్రమంగా పెరుగుతున్నాయి. గత నెలకుగాను రూ.1.68 లక్షల కోట్ల పన్ను వసూలైనట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది. ఏడాది క్రితం ఇదే నెలలో వసూలైన రూ1.45 లక్షల కోట్ల కంటే ఇది 15 శాతం అధికం.
నవంబర్ నెలలో వసూలైన రూ.1,67,929 కోట్లలో సీజీఎస్టీ కింద రూ.30,420 కోట్లు వసూలు కాగా, ఎస్జీఎస్టీ కింద రూ.38,226 కోట్లు, ఐజీఎస్టీ కింద రూ.87,009 కోట్లు వసూలైనట్లు పేర్కొంది. అలాగే సెస్ రూపంలో రూ.12,274 కోట్లు వచ్చాయి. కానీ, అక్టోబర్ నెలలో వసూలైన రూ.1.72 లక్షల కోట్ల కంటే తక్కువగా నమోదయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు మొత్తంగా రూ.13,32,440 కోట్లు వసూలయ్యాయి.
తెలంగాణ రాష్ట్రంలో జీఎస్టీ వసూళ్లు అంతకంతకు పెరుగుతున్నాయి. ఇప్పటికే రికార్డు స్థాయిలో వసూలవుతుండగా, తాజాగా గత నెలలో రూ.4,986 కోట్ల వసూళ్లు అయ్యాయి. ఏడాది క్రితం ఇదే నెలలో వసూలైన రూ.4,228 కోట్లతో పోలిస్తే ఇది 18 శాతం అధికం. ఏపీలో రూ.4,093 కోట్లు వసూలయ్యాయి.