హైదరాబాద్ సిటీబ్యూరో, మే 18 (నమస్తే తెలంగాణ): నిర్మాణ రంగానికి ప్రభుత్వం మరోమారు అండగా నిలిచింది. కరోనా ఆపత్కాల వేళ బిల్డర్లకు, నిర్మాణరంగంపై ఆధారపడిన వారికి, ముఖ్యంగా వలస కార్మికుల ఉపాధికి సంపూర్ణ భరోసా కల్పించింది. గత అనుభవాల దృష్ట్యా శాశ్వతంగా ఇబ్బందులు పడకూడదని భావించిన సర్కారు లాక్డౌన్ నుంచి నిర్మాణరంగానికి మినహాయింపు ఇచ్చింది. భవన నిర్మాణ పనులను యథావిధిగా కొనసాగించుకోవచ్చని స్పష్టంచేసింది. అయితే కూలీలను సైట్లకు తరలించేటప్పుడు, పని ప్రదేశంలో కొవిడ్ నిబంధనలపై బిల్డర్లకు పలు సూచనలు జారీచేసింది. స్టీల్, సిమెంట్, ఇటుక ఇతర నిర్మాణ సామాగ్రిని తరలించే వాహనాలపై ఎలాంటి ఆంక్షలు ఉండవని, ఈ విషయంలో నిర్మాణదారులకు పోలీసులు సహకరించాలని ఆదేశించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల బిల్డర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా నిర్మాణ పనులు జరుపుతామని చెప్తున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో నిర్మాణ రంగంపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడిన 12 లక్షల మందికి మహా ఉపశమనం లభించినట్లయిందని నిపుణులు అంటున్నారు.
లాక్డౌన్ నుంచి నిర్మాణరంగానికి మినహాయింపు ఇవ్వడం మంచి నిర్ణయం. ఇంత చక్కటి నిర్ణయం తీసుకున్న ప్రభుత్వానికి ధన్యవాదాలు
-వీ రాజశేఖర్రెడ్డి, క్రెడాయ్ హైదరాబాద్ జనరల్ సెక్రటరీ
ప్రభుత్వ ఆదేశాల మేరకు బిల్డర్లు 50% సిబ్బందితో కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా పనులు చేపడుతున్నారు. సైట్లలోనే ఐసొలేషన్ కేం ద్రాలు ఏర్పాటు చేశారు. కార్మికులను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు.
-జీవీ రావు, తెలంగాణ డెవలపర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు
లాక్డౌన్లో బిల్డర్లు మాపై ఎలాంటి ఒత్తిడి లేకుండా మా ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. తెలంగాణ సర్కారు కార్మికుల ఆరోగ్యాల పట్ల శ్రద్ధ చూపటం సంతోషంగా ఉంది.
-రాజేశ్ మిశ్రా,భవన నిర్మాణ కార్మికుడు, ఉత్తరప్రదేశ్