న్యూఢిల్లీ, జనవరి 6: భారత్లో ఉత్పత్తయిన ఔషధాల్ని వినియోగించిన కొన్ని దేశాల్లో మరణాలు సంభవించిన నేపథ్యంలో ఫార్మాస్యూటికల్ కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం కొత్త తయారీ ప్రమాణాల్ని నిర్దేశించింది. ఉజ్జబెకిస్థాన్, గాంబియా, కెమరూన్ దేశాల్లో 141 మంది పిల్లలు మృత్యువాత పడటానికి భారత్లో తయారైన దగ్గుమందులే కారణమంటూ డబ్ల్యూహెచ్వో, ఇతర ఆరోగ్య నియంత్రణా సంస్థలు ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది నుంచి కొత్త ప్రమాణాలను పాటించాల్సిందేనని ఆదేశిస్తూ కేంద్ర ఆరోగ్య శాఖ ఒక నోటిఫికేషన్ జారీచేసింది.
ఫార్మా ఉత్పత్తుల తయారీకి వాడుతున్న ముడిపదార్థాలను ఏ మాత్రం పరీక్షించడం లేదని తాము 2022 డిసెంబర్ నుంచి 162 ఔషధ ప్లాంట్లలో జరిపిన తనిఖీల్లో తేలినట్టు మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలో ఉన్న దాదాపు 8,500 చిన్న ఔషధ కంపెనీల్లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్వో) నిర్దేశిత ప్రమాణాలు పాటిస్తున్నవి అతికొద్దిగానే ఉన్నాయని వెల్లడించింది. కొత్త ప్రమాణాల్ని పెద్ద సంస్థలు ఆరు నెలల్లోగా, చిన్న కంపెనీలు 12 నెలల్లోగా పాటించాలని ఆదేశించింది.