Google investments | భారత టెలికం రంగంపై పట్టు సాధించే దిశగా గూగుల్ అడుగులేస్తున్నదా.. ప్రస్తుత పరిణామాలు అందుకు అనుగుణంగానే ఉన్నాయి. భారత్ డిజిటలైజేషన్లో తాము భాగస్వామ్యం వహిస్తామని గూగుల్ ఇంతకుముందే ప్రకటించింది. జియోలో గూగుల్ పెట్టుబడులు రూ.4.36 లక్షల కోట్లు. ఇప్పటికే జియోతో కలిసి చౌకగా స్మార్ట్ ఫోన్ను వినియోగదారులకు అందుబాటులోకి తేనున్నది గూగుల్. వచ్చేనెల 10న వినాయక చవితి సందర్భంగా దాన్ని మార్కెట్లోకి ఆవిష్కరించనున్నాయి జియో-గూగుల్.
తాజాగా భారతీ ఎయిర్టెల్లో భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టేందుకు గూగుల్ సన్నాహాలు చేస్తున్నది. ఈ విషయమై ఎయిర్టెల్ యాజమాన్యంతో గూగుల్ చర్చలు జరిపింది. చర్చలు ఫలప్రదమైతే జియోలో కంటే తక్కువ మొత్తంలో ఎయిర్టెల్లో గూగుల్ పెట్టుబడులు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. జియో, ఎయిర్టెల్లలో పెట్టుబడుల ద్వారా దేశీయ టెలికం రంగంలో గూగుల్ పరోక్షంగా కీలక పాత్ర పోషించడానికి మార్గం సుగమం అవుతుంది.
రుణాలు, ఈక్విటీ షేర్ల విక్రయం ద్వారా నిధులను సమీకరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. ఇందుకోసం ఆదివారం ఎయిర్ టెల్ బోర్డు సమావేశం జరుగుతుంది. గత ఫిబ్రవరిలో రూ.9000 కోట్ల నిధులను ఎయిర్ టెల్ సేకరించింది. బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి ఎయిర్టెల్ రుణాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఎయిర్టెల్ రుణాలు రూ.1.7 లక్షల కోట్లు.
భారత టెలికం రంగంలో కీలకంగా వ్యవహరిస్తున్న మూడు సంస్థల్లో వొడాఫోన్ ఐడియా పరిస్థితి దారుణంగా ఉంది. 2016లో టెలికం రంగంలోకి అడుగిడిన రిలయన్స్ జియోతో పోటీ పడేందుకు భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా అష్టకష్టాలు పడుతున్నాయి. వొడాఫోన్ ఐడియా రుణాల భారం రూ.1.92 లక్షల కోట్లు. ప్రతి మూడు నెలలకోసారి సుమారు రూ.7,000 కోట్ల మేరకు నష్టాలను చవి చూస్తున్నది.
మరోవైపు, నష్టాల నుంచి బయట పడేందుకు మూడు టెలికం సంస్థలు త్వరలో టారిఫ్ రేట్లను పెంచడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. ఇప్పటికే ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా బేసిక్ టారిఫ్ నుంచి లబ్ధి పొందాయి. ఇప్పటి వరకు ఉన్న బేసిక్ రూ.49 రీచార్జి ప్రీమియంను ఉపసంహరించుకున్నాయి. ఇక నిధుల సేకరణకు ఎయిర్టెల్ పూనుకోవడం విశ్లేషకులను ఆశ్చర్య పరుస్తున్నది. నిధుల సేకరణలో ఎయిర్టెల్ సక్సెస్ అయితే మార్కెట్లో ముందడుగు వేయడానికి వీలవుతుందని అంచనా.