797.3 టన్నులుగా నమోదు డబ్ల్యూజీసీ వెల్లడి
ముంబై, జనవరి 28: దేశంలో బంగారానికి డిమాండ్ గతేడాది పెద్ద ఎత్తున పెరిగింది. పసిడి వినియోగం 797.3 టన్నులకు చేరినట్టు ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) తమ తాజా నివేదికలో పేర్కొన్నది. కొనుగోలుదారుల్లో ఎగిసిన ఆశావాహ దృక్పథం.. మార్కెట్ ట్రెండ్ను పరుగులు పెట్టించినట్టు ‘గోల్డ్ డిమాండ్ ట్రెండ్స్ 2021’లో వెల్లడించింది. ఈ క్రమంలోనే అంతకుముందు ఏడాదితో పోల్చితే గోల్డ్ అమ్మకాలు 78.6 శాతం ఎగబాకినట్టు వివరించింది. 2020లో 446.4 టన్నుల బంగారం విక్రయాలు జరిగినట్టు తెలిపింది. ద్వితీయార్ధం (జూలై-డిసెంబర్)లో లాక్డౌన్లు లేకపోవడం, కరోనా ఆంక్షల సడలింపు వంటివి ఆర్థిక వ్యవస్థలో సాధారణ కార్యకలాపాలకు దోహదపడ్డాయని, ఫలితంగానే మార్కెట్ పుంజుకున్నదన్నది. దసరా, దీపావళి, ధనత్రయోదశి అమ్మకాలూ కలిసొచ్చినట్టు ఈ సందర్భంగా డబ్ల్యూజీసీ అభిప్రాయపడింది.
ఈ ఏడాది 850 టన్నులకు..
మార్కెట్లో నెలకొన్న ప్రస్తుత అనుకూల పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఈ ఏడాది దేశంలో బంగారానికి దాదాపు 800-850 టన్నుల డిమాండ్ ఉండొచ్చని డబ్ల్యూజీసీ అంచనా వేసింది. కాగా, గతేడాది ఆభరణాల డిమాండ్ 2020తో పోల్చితే 93 శాతం ఎగిసింది. 315.9 టన్నుల నుంచి 610.9 టన్నులకు చేరింది. ఈ పరిణామాన్నిబట్టి కరోనాకు ముందున్న పరిస్థితులు మళ్లీ మార్కెట్లో వచ్చాయనిపిస్తున్నదని డబ్ల్యూజీసీ పేర్కొన్నది. నిరుడు అక్టోబర్-డిసెంబర్లో 265 టన్నుల నగల అమ్మకాలు జరిగాయని.. పెండ్లిళ్లు, పండుగ సీజన్ డిమాండ్ను ఆరేండ్ల గరిష్ఠానికి చేర్చాయని వెల్లడించింది.
తగ్గిన పసిడి ధరలు
బంగారం ధరలు హైదరాబాద్లో తగ్గుముఖం పట్టాయి. 24 క్యారెట్లు 10 గ్రాముల విలువ రూ.390 తగ్గి రూ.49,250ని చేరింది. 22 క్యారెట్లు రూ.350 దిగి రూ.45,150 పలికింది. కిలో వెండి ధర కూడా రూ.1,400 పడిపోయి రూ.66,300లుగా ఉన్నది. ఢిల్లీలోనూ 10 గ్రాముల ధర రూ.423 దిగి రూ.47,777కు వచ్చింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలు, డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ పతనం ఇందుకు కారణమయ్యాయని బులియన్ మార్కెట్ వర్గాలు ట్రేడింగ్ సరళిని విశ్లేషిస్తున్నాయి. కిలో వెండి ధర సైతం ఢిల్లీలో రూ.1,105 పడిపోయి రూ.61,652కు చేరింది. ఇక గ్లోబల్ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,794 డాలర్లు, వెండి 22.63 డాలర్లుగా ఉన్నది.డబ్ల్యూజీసీ నివేదిక ముఖ్యాంశాలు
‘భారతీయులకు బంగారంపట్ల ఉన్న
సెంటిమెంట్ను 2021 మరోసారి రుజువు చేసింది. ముఖ్యంగా అక్టోబర్-డిసెంబర్లో 343 టన్నులకు డిమాండ్ కనిపించింది. అయినప్పటికీ కరోనా, దాని తదుపరి వేరియంట్లపైనే ఈ ఏడాది డిమాండ్ ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చు. ద్రవ్యోల్బణం, రిజర్వ్ బ్యాంక్ల వడ్డీరేట్లు, అంతర్జాతీయ రాజకీయ పరిస్థితులు కూడా గోల్డ్ డిమాండ్ను
ప్రభావితం చేయవచ్చు’
-సోమసుందరం పీఆర్, డబ్ల్యూజీసీ
ప్రాంతీయ సీఈవో ఇండియా