Gold Rates | అమెరికాలో ద్రవ్యోల్బణం నాలుగు దశాబ్దాల గరిష్ఠానికి తాకింది. పెరిగిపోతున్న ధరలను కట్టడి చేయడానికి మున్ముందు కీలక వడ్డీరేట్లు పెంచక తప్పదని అమెరికా ఫెడ్ రిజర్వు సంకేతాలిచ్చింది. అంతే సోమవారం వివిధ దేశాల స్టాక్మార్కెట్లతోపాటు బంగారం, వెండి ధరలు భారీగా పతనం అయ్యాయి. మల్టీ కమొడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్)లో పది గ్రాముల బంగారం ఫ్యూచర్స్ ధర 0.5 శాతం తగ్గి రూ.50,970కి చేరుకుంది. ఇది నెల రోజుల కనిష్టం. అంతర్జాతీయ మార్కెట్తోపాటు దేశీయ బులియన్ మార్కెట్లోనూ తులం బంగారం ధర రూ.500 తగ్గింది. కిలో వెండి ఫ్యూచర్స్ ధర రూ.54,063లకు పడిపోయింది.
అయితే, రిటైల్ మార్కెట్లో బంగారం ధరలు నగరాల వారీగా విభిన్నంగా ఉన్నాయి. న్యూఢిల్లీలో 24 క్యారట్ల తులం బంగారం ధర రూ.160 తగ్గి రూ.51,600లకు చేరుకుంది. ఈ నెల 20 నుంచి 29 వరకు తులం బంగారం ధర రూ.52,310 నుంచి రూ.710 తగ్గి రూ.51,600లకు చేరింది.
అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ఔన్స్ ధర 0.3 శాతం తగ్గి 1732.17 డాలర్లకు చేరుకుంది. డాలర్ ఇండెక్స్ రెండు దశాబ్దాల గరిష్ఠం 109.29కి చేరుకున్నది. వివిధ దేశాల కరెన్సీల విలువతో డాలర్ బలోపేతం కాగా, బంగారం మరింత పిరమైంది. స్పాట్ వెండి ఔన్స్ ధర ఒకశాతం తగ్గి 18.69 డాలర్లకు చేరింది. ఔన్స్ ప్లాటినం ధర కూడా ఒకశాతం తగ్గి 855.27 డాలర్లు పలుకుతున్నది.
కీలక వడ్డీరేట్లు పెంచక తప్పదని ఫెడ్ రిజర్వు చైర్మన్ జెరోమ్ పావెల్ శుక్రవారం చేసిన ప్రకటనతో సోమవారం స్టాక్మార్కెట్లన్నీ కుదేలయ్యాయి. డోజోన్, నాస్డాక్ మూడు శాతానికి పైగా నష్టాలతో ముగిశాయి. భారత్లో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్ఈ) ఇండెక్స్ సెన్సెక్స్ ట్రేడింగ్ ముగిసే సమయానికి 861 పాయింట్ల నష్టంతో సరిపెట్టుకుంది.