రామాయంపేట, జూన్ 25: కరోనా విపత్కర సమయంలో ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు కచ్చితంగా కరోనా వ్యాక్సిన్ వేసుకోవాలని జిల్లా విద్యాధికారి రమేశ్ అన్నారు. శుక్రవారం రామాయంపేటకు విచ్చేసిన విద్యాధికారి పట్టణంలోని ప్రభుత్వ దవాఖానను సందర్శించి టీచర్లుకు వ్యాక్సినేషన్ను వేయించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా నేడు 923 ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమయ్యాయన్నారు.ప్రభుత్వ సూచనల మేరకు విద్యావ్యవస్థ నడుస్తుందన్నారు. ప్రభుత్వం విద్యార్థులను పాఠశాలలకు రావాలని ఉత్తర్వులను జారీ చేస్తే అప్పటి నుంచి టీచర్లు విద్యార్థులకు బోధన చేపడుతారన్నారు. గతంలో కరోనా సమయంలో ఒక్కో తరగతి గదిలో 20మంది విద్యార్ధులకు బోధించారన్నారు. భౌతిక దూరం పాటిస్తూ ప్రతి టీచర్ మాస్కులను ధరించాలన్నారు. ఉపాధ్యాయుల కోసమే ప్రభుత్వం మూడు రోజుల పాటు వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించిందని అన్నారు. ఈ మూడు రోజుల్లో ఉపాధ్యాయు లందరూ కచ్చితంగా వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు.
టీచర్లకు టీకా
పాఠశాలలు పునఃప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బందికి టీకాలు వేయాలని నిర్ణయించింది. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు 3,454 మంది ఉండగా, బోధనేతర సిబ్బంది 170 మంది మాత్రమే ఉన్నారు. మొదటి రోజు 381 మంది వ్యాక్సిన్ వేసుకున్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యాశాఖ అధికారులు సూచిస్తున్నారు.