Gold @ Dhanteras | ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తులం బంగారం ధర ఈ ఏడాది గరిష్ట స్థాయి నుంచి రూ.4000 పతనమైంది. గత ఏప్రిల్ 18వ తేదీన రూ.54,380 పలికింది 24 క్యారట్ల బంగారం. బుధవారం ఇదే బంగారం ధర రూ.50,240లకే లభించిందని ఇండియన్ బులియన్ అండ్ జ్యువెల్లర్స్ అసోసియేషన్ (ఐబీజేఏ) పేర్కొంది. శుక్రవారం స్పాట్ మార్కెట్లో 24 క్యారట్ల తులం బంగారం ధర రూ. 50,228 వద్ద స్థిర పడిందని ఐబీజేఏ తెలిపింది. దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం ధర తగ్గుముఖం పట్టడానికి పలు కారణాలు ఉన్నాయి. ఒకవైపు, ప్రపంచ దేశాల సెంట్రల్ బ్యాంకులు కీలక వడ్డీరేట్లు పెంచుతుండటంతో అమెరికా బాండ్లు, డాలర్ బలోపేతం అయ్యాయి. ఫలితంగా బంగారంపై డిమాండ్ ఒత్తిళ్లకు గురవుతున్నది.
గత నెలలో వడ్డీరేట్లు పెంచుతూ అమెరికా ఫెడ్ రిజర్వు నిర్ణయించడంతో డాలర్ రెండు దశాబ్ధాల గరిష్టానికి చేరుకుంది. యూఎస్ ట్రెజరీ బాండ్లు 12 ఏండ్ల గరిష్ట స్థాయిని తాకాయి. ఉక్రెయిన్పై రష్యా సైనిక చర్యకు దిగినప్పటి నుంచి డాలర్ క్రమంగా బలోపేతం అవుతూనే ఉంది. ఫలితంగా డాలర్ విలువ పెరగడం బంగారం విలువ తగ్గుముఖం పట్టడం జరుగుతున్నది. డాలర్పై రూపాయి మారకం విలువ పతనం వల్ల దేశీయ బులియన్ మార్కెట్లో పుత్తడి ధర తగ్గుముఖం పట్టడానికి అంతర్జాతీయ పరిణామాలతో సంబంధం లేదని అనలిస్టులు చెబుతున్నారు. వాస్తవంగా రూపాయి మారకం విలువ పతనమైతే బంగారం ధర పెరుగాల్సి ఉంటుంది. డాలర్పై రూపాయి మారకం విలువ రూ.83 కంటే కనిష్ట స్థాయికి పడిపోయింది.
వడ్డీరేట్లు పెంచడంతో బంగారంపై ఇన్వెస్ట్మెంట్లు సన్నగిల్లుతాయన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ధరల సర్దుబాటు జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ వారంలో మల్టీ కమొడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్)లో తులం బంగారం ధర రూ. 48,800 నుంచి రూ.50,600 మధ్య తచ్చాడుతుందని అంటున్నారు. ఇటీవలి ట్రేడింగ్ల్లో బంగారం ధర పతనమైన నేపథ్యంలో ప్రస్తుత ఫెస్టివ్ సీజన్లో పుత్తడిపై పెట్టుబడితో రిటర్న్స్ వస్తాయని భావిస్తున్నారు.