గోల్డ్ మార్కెట్ పండుగ కళను సంతరించుకున్నది.
మొన్నటిదాకా పడుతూలేస్తూ సాగిన పసిడి ధరలు.. ఇప్పుడు వేగాన్ని అందుకున్నాయి.
ఒక్కరోజే దేశీయంగా తులం రూ.700లకుపైగా ఎగిసిన పుత్తడి విలువ.. హైదరాబాద్లో రూ.61,500లను దాటేసింది.
న్యూఢిల్లీ, అక్టోబర్ 20: పండుగల వేళ పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి. శుక్రవారం ఒక్కరోజే హైదరాబాద్ మార్కెట్లో తులం 24 క్యారెట్ స్వచ్ఛమైన బంగారం ధర రూ.770 పుంజుకున్నది. దీంతో రూ.61,530కి చేరుకున్నది. అంతకుముందు రెండు రోజుల్లోనూ రేట్లు పెరుగగా.. వరుసగా ఈ మూడు రోజుల్లో రూ.1,580 ఎగిసింది. 22 క్యారెట్ ఆభరణాల బంగారం 10 గ్రాములు సైతం రూ.700 ఎగబాకింది. రూ.56,400లుగా ఉన్నది. మూడు రోజుల్లో రూ.1,450 పెరిగింది. ఇక దేశ రాజధాని నగరం ఢిల్లీ మార్కెట్లోనూ పుత్తడి ధరలు దూకుడు మీదున్నాయి. 24 క్యారెట్ 10 గ్రాములు రూ.61,650 పలుకుతున్నది. గురువారంతో పోల్చితే మరో రూ.750 అందిపుచ్చుకున్నది.
ప్రస్తుత పండుగల సీజన్, రాబోయే పెండ్లిళ్ల సీజన్ రెండూ.. గోల్డ్ మార్కెట్కు కొత్త కళను తెచ్చిపెట్టాయి. బంగారం దుకాణాల్లో ఇప్పుడు కొనుగోలుదారుల సందడి కనిపిస్తున్నది. ధరలు క్రమేణా పెరుగుతుండటం కూడా.. కస్టమర్లను మార్కెట్కు రప్పిస్తున్నదని పలువురు దుకాణదారులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే వచ్చే నెల దీపావళికి పుత్తడి ధర మరింత పెరుగవచ్చన్న అంచనాలూ వినిపిస్తున్నాయి.
మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రష్ కొనసాగుతున్నది. ఔన్స్ బంగారం 1,980 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతున్నది. గ్లోబల్ స్టాక్ మార్కెట్లో ట్రెండ్ బలహీనంగా ఉండటంతో మదుపరులు పుత్తడిపై పెట్టుబడులకు ఆసక్తిని కనబరుస్తున్నట్టు ట్రేడర్లు తాజా సరళిని విశ్లేషిస్తున్నారు. రష్యా-ఉక్రెయిన్ ఉద్రిక్తతలకు ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం తోడవడంతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడుల రక్షణార్థం బంగారం వైపునకొస్తున్నారు. ఈ క్రమంలోనే కొమెక్స్ స్పాట్ గోల్డ్ దాదాపు 4 నెలల గరిష్ఠాన్ని తాకింది. ఇదిలావుంటే వెండి ఔన్స్ 23.20 డాలర్లుగా ఉన్నది. హైదరాబాద్లో కిలో వెండి రూ.77,500 వద్ద స్థిరంగా కొనసాగుతున్నది. అయితే ఢిల్లీలో రూ.500 పెరిగి రూ.74,700లకు చేరింది.
గత నెల గోల్డ్ ఎక్సేంజ్-ట్రేడెడ్ ఫండ్లకు ఆదరణ తగ్గింది. సెప్టెంబర్లో రూ.175 కోట్లకే పెట్టుబడులు పరిమితమయ్యాయి. అంతకుముందు నెల ఆగస్టులో 17 నెలల గరిష్ఠాన్ని తాకిన విషయం తెలిసిందే. నాడు రూ.1,028 కోట్లుగా ఉన్నాయి. అయితే మదుపరులు లాభాల స్వీకరణకు పెద్దపీట వేయడం వల్లే తాజా గణాంకాలు నిరాశాజనకంగా ఉన్నాయని దేశీయ మ్యూచువల్ ఫండ్స్ సంఘం (యాంఫీ) తెలియజేసింది. కానీ అమెరికాలో పెరుగుతున్న వడ్డీరేట్లు, అంచనాలకు మించి నమోదవుతున్న ద్రవ్యోల్బణం, మందగిస్తున్న వృద్ధిరేటు మధ్య గోల్డ్ ఈటీఎఫ్లకు ఆదరణ మున్ముందు ఉంటుందనే విశ్వాసాన్నే ఇండస్ట్రీ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇదిలావుంటే ఈ జనవరి-మార్చిలో ఏకంగా రూ.1,243 కోట్ల ఉపసంహరణలు జరిగాయి. నిరుడు జూలై-డిసెంబర్ మధ్య కూడా రూ.485 కోట్లు వెనక్కిపోయాయి.