న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2: బంగారం ధర రికార్డు స్థాయిలో దూసుకుపోతున్నది. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాలకు డిమాండ్ ఉండటంతోపాటు బడ్జెట్లో కస్టమ్స్ సుంకం పెంచడంతో దేశీయంగా ఒక్కసారిగా ధరలు పుంజుకున్నాయి. ఢిల్లీ బులియన్ మార్కెట్లో తులం బంగారం రూ.770 అధికమై రూ.58 వేలు దాటి రూ.58,680కి చేరుకున్నది. అంతకుముందు ఇది రూ.57,910గా ఉన్నది. పసిడితోపాటు వెండి పరుగులు పెట్టింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు ఊపందుకోవడంతో కిలో వెండి ఏకంగా రూ.1,500 అధికమై రూ.71,660 పలికింది.
హైదరాబాద్లోనూ బంగారం రికార్డు స్థాయికి చేరుకున్నది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.650 ఎగబాకి రూ.58,470 పలుకగా..22 క్యారెట్ల ధర రూ.600 అధికమై రూ.53,600 పలికింది. గత రెండు రోజుల్లోనే పసిడి వెయ్యి రూపాయలకు పైగా అధికమైంది. అటు వెండి కూడా రూ.1,800 పెరిగి రూ.77,800 పలికింది. ముంబైలో గోల్డ్ ధర రూ.58,880 పలికింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 1,956 డాలర్లు పలుకగా, వెండి 24.15 డాలర్లుగా నమోదైంది. అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్లను పావు శాతం పెంచింది.