బంగారం భగ..భగ మండుతున్నది. గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన పుత్తడి మళ్లీ పుంజుకున్నది. పశ్చిమాసియా దేశాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అతి విలువైన లోహాల ధరలు రాకెట్ వేగంతో దూసుకుపోయాయి. బంగారం ధర రూ.1.73 లక్షలకు చేరుకోగా, వెండి తిరిగి రూ.3 లక్షలకు చేరుకున్నది. అమెరికా, ఇజ్రాయిల్-ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా మదుపరులు తమ పెట్టుబడులను ఈక్విటీల నుంచి అతి విలువైన లోహాలకు మళ్లించడంతో వీటి ధరలు 12 శాతం వరకు ఎగబాకాయని ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ వెల్లడించింది. దేశ రాజధాని నూఢిల్లీలో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల బంగారం ధర రూ.8,100 లేదా 5 శాతం ఎగబాకి రూ.1,72,800కి చేరుకున్నది. గత ముగింపులో ఇది రూ.1,64,700గా ఉన్నది. ఇటు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో తులం బంగారం ధర రూ.1.73 లక్షలకు చేరుకున్నది.
3 లక్షలకు వెండి
బంగారంతో పాటు వెండి పరుగులు పెడుతున్నది. కిలో వెండి ఏకంగా రూ.32 వేలు లేదా 12 శాతం ఎగబాకి రూ.3 లక్షలకు చేరుకున్నది. గత శుక్రవారం వెండి రూ.2.68 లక్షలుగా ఉన్నది. ఒకేరోజు ఇంతటి స్థాయిలో పెరుగడం ఇటీవల కాలంలో ఇదే మొదటిసారి. హైదరాబాద్లో కిలో వెండి రూ.3.15 లక్షలకు చేరింది. అంతర్జాతీయంగా రాజకీయ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం వల్లనే పుత్తడి, వెండి ధరలు భారీగా పెరిగాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 116.38 డాలర్లు లేదా 2.21 శాతం ఎగబాకి 5,394.28 డాలర్లకు చేరుకోగా, వెండి 1.43 శాతం అధికమై 95.19 డాలర్లకు చేరుకున్నది.