న్యూఢిల్లీ, ఏప్రిల్ 8: బంగారం పరుగులు పెట్టింది. ఢిల్లీలో తులం బంగారం ధర మరో రూ.350 పెరిగి రూ.71,700కి చేరుకున్నది. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాలపై పెట్టుబడులు పెట్టేవారు అధికంగా ఉండటంతో దేశీయంగా రోజుకొక రికార్డును అధిగమిస్తున్నది. అంతకుముందు గరిష్ఠ స్థాయి రూ.71,350 పలికిన విషయం తెలిసిందే. దీంతో ఈ ఏడాదిలో తులం బంగారం ధర రూ.7,700 పెరిగినట్లు అయింది. గడిచిన నాలుగు నెలలుగా పెరుగుతూనే ఉన్నట్లు ఆభరణాల వర్తకులు వెల్లడిస్తున్నారు.
బంగారంతోపాటు వెండి మరో శిఖరంపైన కూర్చున్నది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు ఊపందుకోవడంతో కిలో వెండి రూ.800 అందుకొని రూ.84 వేలు పలికింది. ఇటు హైదరాబాద్లోనూ 22 క్యారెట్ తులం పుత్తడి ధర రూ.300 అధికమై రూ.65,650 పలుకగా, 24 క్యారె ధర రూ.330 అందుకొని రూ.71,620కి చేరుకున్నది. అలాగే కిలో వెండి రూ.1,000 పెరిగి రూ.88 వేలకు ఎగబాకింది.