Gold Rates | న్యూఢిల్లీ, అక్టోబర్ 31: దేశంలో బంగారానికి ఆదరణ పెరిగింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద పసిడి వినియోగదారుగా ఉన్న భారత్లో.. ఈ ఏడాది జూలై-సెప్టెంబర్ త్రైమాసికం (క్యూ3)లో గోల్డ్ డిమాండ్ 210.2 టన్నులుగా నమోదైంది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో 191.7 టన్నులుగా నగల కొనుగోళ్లు, కడ్డీలు-నాణేలపై పెట్టుబడులుండగా, ఈసారి 10 శాతం పెరిగినట్టు మంగళవారం విడుదలైన ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) తాజా గణాంకాల్లో తేలింది. కాగా, నగలతో పోల్చితే బంగారు కడ్డీలు, నాణేలకు గత త్రైమాసికంలో డిమాండ్ ఎక్కువైందని ఈ సందర్భంగా డబ్ల్యూజీసీ ఇండియా ప్రాంతీ య సీఈవో సోమసుందరం పీఆర్ తెలిపారు.
దేశీయ మార్కెట్లో బంగారం ధరలు తగ్గితే డిమాండ్ మరింత పుంజుకోవచ్చన్న అభిప్రాయాన్ని సోమసుందరం వ్యక్తం చేశారు. తులం రూ.60,000 పలుకుతున్నా కొనేందుకు ముందుకొస్తున్నారన్న ఆయన ధర తగ్గితే కొనుగోళ్లు ఇంకా పెరుగవచ్చన్న అంచనాను వెలిబుచ్చారు. నిజానికి ఈ జూలై-సెప్టెంబర్లో గోల్డ్ రేట్లు కొంత దిగొచ్చాయని, దీనికితోడు పండుగ సీజన్ కూడా అమ్మకాలను పెంచాయని చెప్పారు. దక్షిణాది మార్కెట్లో లావాదేవీలు ఆకర్షణీయంగా జరిగినట్టు వెల్లడించారు. అయితే ఇప్పుడు ధరలు మళ్లీ పెరగడం మొదలైందన్నారు. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే రాబోయే ధనత్రయోదశి, పెండ్లిళ్ల సీజన్లో అమ్మకాలు ప్రభావితమయ్యే వీలుందని వ్యాఖ్యానించారు. అయినప్పటికీ బడా వ్యాపారులు కస్టమర్లను రివార్డులు, ఆఫర్లతో ఆకట్టుకుని తమ మార్కెట్ వాటాను కాపాడుకుంటారన్న విశ్వాసాన్నీ ప్రదర్శించారు.
22 క్యారెట్ జ్యుయెల్లరీ కంటే 18 క్యారెట్, 14 క్యారెట్ బంగారు నగలకే మార్కెట్లో డిమాండ్ ఉన్నట్టు డబ్ల్యూజీసీ తెలియజేసింది. పెరుగుతున్న పసిడి ధరలే ఇందుకు కారణమని పేర్కొన్నది. అయితే ఈ పరిణామం నగల వ్యాపారులకు లాభదాయకంగా మారుతున్నట్టు చెప్పింది. 22 క్యారెట్ ఆభరణాలకన్నా 18-14 క్యారెట్ ఆభరణాల్లో ఎక్కువగా రాబడి ఉంటున్నట్టు చెప్పింది. ఇకపోతే ధరల్లో స్థిరత్వం లోపించిన నేపథ్యంలో నగల కంటే బంగారు కడ్డీలు, నాణేలపై పెట్టుబడులకే ఎక్కువమంది మొగ్గుచూపుతున్నారు. ధరలు ఇంకా పెరిగితే బార్స్, కాయిన్స్కు డిమాండ్ ఉంటుందన్న అభిప్రాయాలు ఉన్నాయి.