మహబూబ్నగర్, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం లగచర్లలో 2024 నవంబర్ 11న ఫార్మా భూసేకరణ కోసం అభిప్రాయ సేకరణకు వెళ్లిన కలెక్టర్ ప్రతీక్ జైన్, ఇతర అధికారులపై గ్రామస్తులు తిరుగబడ్డ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇది రాజకీయంగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య తీవ్ర యుద్ధానికి దారితీసింది. బీఆర్ఎస్ నేతలు, రైతులు అందరూ జైల్లో ఉండగా భూముల సేకరణలో భారీ అక్రమాలకు పాల్పడ్డారు. అఖిల్ పేట గ్రామానికి చెందిన మాజీ పట్వారి సహాయంతో రికార్డులన్నీ పథకం ప్రకారం దిద్దించి ప్రభుత్వ భూమిని చెరబట్టారు.
అనేకమంది రైతుల భూములకు అరకొర పరిహారం అందించారు. ఇప్పటికీ రైతులను భయభ్రాంతులను గురిచేస్తూ ఈ కుంభకోణం బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు. తాజాగా హకీంపేట ఇండస్ట్రియల్ పార్క్ భూసేకరణలోజరిగిన భారీ కుంభకోణం బయటపడడంతో ఆనాటి ఘటనపైనా అనుమానాలు తలెత్తుతున్నాయి. రైతులను రెచ్చగొట్టడం, వారు తిరుగబడేలా చేయడం ఇదంతా పథకంలో భాగమేనని రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తున్న ఫార్మాసిటీకి భూములు బలవంతంగా లాక్కునేందుకు ప్రయత్నం చేయడమే కాకుండా గ్రామసభల్లో కొంతమంది కాంగ్రెస్ నేతలు అధికారుల అండదండలతో రెచ్చగొట్టి లగచర్ల ఘటనకు ఆజ్యం పోశారు. రైతులంతా తిరుగబడడంతో వారందరిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపారు. ప్రభుత్వం ఫార్మాసిటీపై వెనక్కి తగ్గినట్టు నటించి చివరకు ఈ ఘటనను అడ్డం పెట్టుకొని ఫార్మా కారిడార్లు రద్దుచేసింది. హకీంపేట మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్కుగా భూసేకరణ చేపట్టింది.
రైతులను జైల్లో ఉంచి, పోలీసుల భయంతో చాలామంది గ్రామాలు విడిచి ఆజ్ఞాతంలో ఉండగా బలవంతంగా భూములు సేకరించింది. అయితే ఈ ఘటనను అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ నేతలు అధికార యంత్రాంగంతో కలిసి భూ పరిహారంలో భారీ దోపిడీకి ప్లాన్ చేశారు. లగచర్ల చుట్టుపక్కల ఉన్న తండాలను పోలీసుల నిఘా నీడలో పెట్టి ఎవరికీ అనుమానం రాకుండా తమ పని కానిచ్చుకున్నారు. రైతులకు ఇవ్వాల్సిన పరిహారం పక్కదారి పట్టించి భారీ కుంభకోణానికి పాల్పడ్డారు. అయితే ‘నమస్తే తెలంగాణ’లో వస్తున్న వరుస కథనాలు అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నాయి. లగచర్ల ఘటనను అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ నేతలు ఆడిన డ్రామా ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతున్నది.
హకీంపేట గ్రామ సర్పంచ్ భర్త అయిన గజ్జల నరసింహారెడ్డి కుటుంబసభ్యులకు ఏకంగా 16 ఎకరాలు రాసుకొని భారీ పరిహారం నొక్కేశారు. దుద్యాల మండలం హకీంపేట గ్రామంలో సర్వే నంబర్ 252లో ప్రభుత్వ భూమిని కూడా ఇండస్ట్రియల్ పార్కుకు సేకరించారు. ఊరందరికీ పరిహారం ఇప్పిస్తున్నానని అనుకున్నారేమో గజ్జల కుటుంబానికి కూడా ఏకంగా 16 ఎకరాలకు రూ. 3.2 కోట్లు తీసుకొని ఔరా అనిపించారు. కుటుంబసభ్యుల పేర్లు పరిహారం పొందిన సర్వే నంబర్ల ఎకరాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.