Gold Rate | అంతర్జాతీయంగా డాలర్ ఇండెక్స్ పతనం కావడంతో బంగారం ధర శుక్రవారం కూడా దిగి వచ్చింది. దేశ రాజధానిలో 24 క్యారట్స్ బంగారం తులం ధర రూ.250 తగ్గి రూ.58,700 పలికింది. గురువారం తులం బంగారం ధర రూ.58,950 పలికిన సంగతి తెలిసిందే.
మరోవైపు శుక్రవారం కిలో వెండి ధర రూ.1200 పుంజుకుని రూ.74,300లకు చేరుకున్నదని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ కమొడిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. దేశీయ మార్కెట్లో బంగారం ధరలు తగ్గడం మార్చి 19 తర్వాత ఇదే తొలిసారి అని చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం 1871 డాలర్లు, ఔన్స్ వెండి 23.05 డాలర్లు పలుకుతున్నది. అమెరికా ఫెడ్ రిజర్వు కీలక వడ్డీరేట్లు సుదీర్ఘకాలం పొడిగిస్తుందన్న వార్తల నేపథ్యంలో వారం రోజులుగా బంగారం ధరలు పతనం అవుతున్నాయి.
ఢిల్లీలో స్పాట్ గోల్డ్ ధరలు తగ్గుముఖం పడితే.. మల్టీ కమొడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్)లో గోల్డ్ కాంట్రాక్ట్స్ అక్టోబర్ డెలివరీ తులం బంగారం ధర రూ.224 పెరిగి రూ.58,070 వద్ద నిలిచింది. అంతర్జాతీయ మార్కెట్లో (న్యూయార్క్) ఫ్యూచర్స్ గోల్డ్ ధర ఔన్స్ 0.62 శాతం పెరిగి 1890.20 డాలర్లు పలికింది.