న్యూఢిల్లీ, జనవరి 11: జర్మనీకి చెందిన విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ..దేశీయ మార్కెట్పై మరింత పట్టుసాధిస్తున్నది. 2023లో సంస్థ 22,940 యూనిట్ల లగ్జరీ కార్లు, మోటర్సైకిళ్లను విక్రయించింది. వీటిలో బీఎండబ్ల్యూ, మినీ బ్రాండ్లకు చెందిన 14,712 యూనిట్ల విక్రయాలు జరిపిన సంస్థ..8,768 యూనిట్ల మోటర్సైకిళ్లను అమ్మకాలు జరిపింది. 2022లో విక్రయించిన 19,263 యూనిట్ల కంటే ఇది 19 శాతం అధికం. ఈ సందర్భంగా బీఎండబ్ల్యూ గ్రూపు ఇండియా ప్రెసిడెంట్ విక్రమ్ పవాహ్ మాట్లాడుతూ..2023లో రికార్డు స్థాయి విక్రయాలు జరిపినట్లు, ముఖ్యంగా బీఎండబ్ల్యూ, మినీ, బీఎండబ్ల్యూ మోటరాడ్ బైకులకు కస్టమర్ల నుంచి విశేష స్పందన లభించినట్లు చెప్పారు.
ఈ ఏడాది కూడా దేశీయ మార్కెట్లోకి 19 నూతన మాడళ్లను విడుదల చేయనున్నట్టు ఆయన ప్రకటించారు. వీటిలో రెండు ఈవీలను కలుపుకొని 13 కార్లు, ఆరు బైకులు ఉన్నాయని చెప్పారు. 2023లో సంస్థ 23 నూతన మాడళ్లను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. 2025 నాటికి మొత్తం వాహన విక్రయాల్లో ఈవీల వాటా 25 శాతంగా ఉంటుందన్న ఆయన..అందుకోసం ఇప్పటి నుంచే ప్రతియేటా పలు మాడళ్లను అందుబాటులోకి తీసుకోస్తున్నట్లు చెప్పారు.
నూతన టెక్నాలజీ ఆపాదించుకోవడం, ఎలక్ట్రిక్ వాహనాలపై విధిస్తున్న పన్నులను హేతుబద్దీకరించాల్సిన అవసరం ఉన్నదని విక్రమ్ వ్యాఖ్యానించారు. ఇతర దేశాల నుంచి దిగుమతి అవుతున్న వాహనాలపై పన్నులు అధికంగా ఉన్నాయని, దీంతో కొనుగోలుదారులపై అధిక భారం పడుతున్నదని, దీనిని తగ్గించాల్సిన అవసరం ఉన్నదని, అప్పుడే తక్కువ ధరకే వాహనం లభించనున్నదన్నారు. ప్రస్తుతం సీబీయూఎస్లపై కస్టమ్స్ డ్యూటీని 60 శాతం నుంచి 100 శాతం విధిస్తున్నారు. దిగుమతి చేసుకునే వాహనాలపై రాయితీలు ఇవ్వాలన్న ప్రతిపాదనేది తమ వద్ద లేదని, దిగుమతి సుంకాలను ఆమోదయోగ్య స్థాయిలో విధించాలని కోరుతున్నట్లు చెప్పారు.
నూతన టెక్నాలజీ కోసం సంస్థ భారీగా పెట్టుబడులు పెడుతున్నదని, ఎలాంటి రాయితీలు ఇవ్వకపోయినప్పటికీ కస్టమర్లు కోరుకుంటున్న విధంగా కార్లను తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. భారత్లో లగ్జరీ కార్ల మార్కెట్ చాలా తక్కువగానే ఉన్నదని, దేశవ్యాప్తంగా అమ్ముడువుతున్న ప్యాసింజర్ కార్లలో ఈ వాటా కేవలం ఒక్క శాతం మాత్రమేనని స్పష్టంచేరు. దేశ ఆర్థిక పరిస్థితులు, కొనుగోలుదారుల సెంటిమెంట్ ఆధారంగా లగ్జరీ కార్లకు డిమాండ్ ఉంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు.