Adani | న్యూఢిల్లీ, జూలై 21: బిలియనీర్ గౌతమ్ అదానీ.. పొరుగు దేశం శ్రీలంకపై దృష్టి పెట్టారు. ఇప్పటికే అక్కడ పలు ప్రాజెక్టులతో పాగా వేసిన అదానీ.. మరింత బలోపేతమయ్యే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే లంకలో ఓ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ను ఏర్పాటు చేయాలనే యోచనలో ఉన్నారు. భారత్ పర్యటనకు వచ్చిన శ్రీలంక అధ్యక్షుడు రణీల్ విక్రమసింఘేను శుక్రవారం కలిసిన అదానీ.. ఈ ప్రతిపాదనను ముందుంచారు. ప్రస్తుత ప్రాజెక్టులతోపాటు కొత్త వెంచర్పై రణీల్తో చర్చించినట్టు అదానీ ట్వీట్ చేశారు. 2030 నాటికి 10 లక్షల టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిని అదానీ న్యూ ఇండస్ట్రీస్ లిమిటెడ్ లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు.
హిండెన్బర్గ్ రిపోర్టుతో అదానీ గ్రూప్నకు జరిగిన నష్టం ఎంతో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారత్లోనేగాక, ఆసియా దేశాల్లోనే అత్యంత ధనవంతుడిగా రికార్డులకెక్కిన గౌతమ్ అదానీ సంపద.. ఈ నివేదికతోనే సగానికిపైగా కరిగిపోయిన విషయం తెలిసిందే. దేశీయ స్టాక్ మార్కెట్లలో అదానీ గ్రూప్ షేర్లన్నీ భారీగా పతనాన్ని చూడగా.. కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు-అదానీ గ్రూప్ దోస్తీపైనా పార్లమెంట్ స్థాయిలో పెద్ద చర్చే జరిగినదీ విదితమే. దీంతో ఒక్కసారిగా అదానీ ప్రతిష్ఠ, పరపతి పడిపోగా.. చాలావరకు స్తబ్ధుగానే గ్రూప్ కార్యకలాపాలు సాగాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న అదానీ గ్రూప్.. భారత్ కంటే విదేశాలే పదిలమని భావిస్తున్నదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అందుకే శ్రీలంకపై అదానీ గురి పెట్టారంటున్నారు.
అదానీ గ్రూప్లోని రెన్యువబుల్ ఎనర్జీ సంస్థ అదానీ గ్రీన్ ఎనర్జీ.. శ్రీలంకలో 500 మిలియన్ డాలర్ల పెట్టుబడితో రెండు విండ్ పవర్ ప్రాజెక్టులను చేపడుతున్నది. మన్నార్లో 286 మెగావాట్ల సామర్థ్యం కలిగిన పవన విద్యుదుత్పత్తి కేంద్రాన్ని తెస్తున్న అదానీ.. పూనెర్యన్లో మరో 234 మెగావాట్ల విండ్ పవర్ ప్రాజెక్టును తీసుకువస్తున్నది. వచ్చే ఏడాది ఆఖరుకల్లా ఈ ప్రాజెక్టులు పూర్తికావచ్చని అంచనా. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఓ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుకూ అదానీ కసరత్తు చేస్తుండగా, ఇది కుదిరితే శ్రీలంక పవర్ ఇండస్ట్రీలో మెజారిటీ షేర్అదానీకే వెళ్తుందని తెలుస్తున్నది. అయితే శ్రీలంక ప్రాజెక్టులు అదానీకి దక్కడంలో మోదీ సాయం ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో మళ్లీ ఢిల్లీ వేదికగానే అదే దేశంలో ఇంకో ప్రాజెక్టుకు లైన్క్లియర్ చేసుకోవడానికి అదానీ ప్రయత్నిస్తుండటం ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకున్నది.
కొలంబో పోర్టువద్ద 700 మిలియన్ డాలర్ల పెట్టుబడితో అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ (ఏజీసెజ్) ఓ కంటైనర్ టర్మినల్ను అభివృద్ధి చేస్తున్నది. దక్షిణాసియాలోనే ఈ పోర్టు ప్రధాన రవాణా కేంద్రంగా ఉండగా, అందుకే అదానీ వ్యూహాత్మకంగానే ఈ కంటైనర్ టర్మినల్ను ఇక్కడ నిర్మిస్తున్నారని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇక కొలంబో పోర్టుకు కేవలం 176 నాటికల్ మైళ్ల దూరంలో భారతీయ తీరప్రాంత రాష్ట్రమైన కేరళలో విజింజమ్ సీపోర్టు నిర్మాణాన్ని కూడా అదానీ గ్రూపే చేపడుతున్నది. ఈ రెండూ పూర్తయితే భారత్-శ్రీలంక రవాణా కారిడార్లో అదానీదే పెత్తనమన్న అంచనాలు ఇప్పుడు గట్టిగా వస్తున్నాయి.