న్యూఢిల్లీ, జూన్ 17: ప్రధాని నరేంద్ర మోదీ సన్నిహిత మిత్రుడిగా పేరొందిన గౌతమ్ అదానీ..ఆన్లైన్లో రైలు టిక్కెట్ల విక్రయానికి దిగుతున్నారు. ఆన్లైన్ ట్రైన్ టికెటింగ్ రంగంలో గుత్తాధిపత్యం వహిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ రైల్వే కేటరింగ్, టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ)కి గట్టిపోటీ ఇచ్చేందుకు సిద్దమవుతున్నారు. ఈ ఉద్దేశ్యాన్ని అదానీ గ్రూప్ ఫ్లాగ్షిప్ కంపెనీ అదానీ ఎంటర్ప్రైజెస్ శనివారం వెల్లడించింది. ‘ట్రైన్మాన్’ పేరుతో ఆన్లైన్ ట్రైన్ టికెట్ బుకింగ్ సంస్థ స్టార్క్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎస్సీపీఎల్)లో నూరు శాతం వాటాను టేకోవర్ చేసేందుకు షేర్ల కొనుగోలు ఒప్పందంపై తమ సబ్సిడరీ అదానీ డిజిటల్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంతకాలు చేసినట్టు అదానీ ఎంటర్ప్రైజెస్ స్టాక్ ఎక్సేంజీలకు తెలిపింది. గుర్గ్రామ్ కేంద్రంగా ఐఐటీ రూర్కెలా గ్రాడ్యుయేట్లు వినీత్ చిరానియా, కరన్కుమార్లు ఎస్ఈపీఎల్ను స్థాపించారు. ఈ కంపెనీ ఇటీవలే యూఎస్ ఇన్వెస్టింగ్ సంస్థలు గుడ్వాటర్ క్యాపిటల్, హెమ్ ఏంజిల్స్ తదితరాల నుంచి 10 లక్షల డాలర్ల నిధుల్ని సమీకరించింది. ఎస్సీపీఎల్ను ఎంతవిలువకు కొనుగోలు చేసిందీ అదానీ ఎంటర్ప్రైజెస్ వెల్లడించలేదు.
ట్రిపుల్ ఐటీలో సిల్వర్ జూబ్లీ కాంటెస్ట్
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 17 (నమస్తే తెలంగాణ): ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ట్రిపుల్ ఐటీ) ఆధ్వర్యంలో సిల్వర్ జూబ్లీ ఆర్ట్ ఇన్స్టాలేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. విద్యా సంస్థలో ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులతో పాటు పూర్వ విద్యార్థులు సైతం డిజైన్లను ఈనెల 21వ లోగా పంపించాలని సూచించారు. ఆసక్తి ఉన్న వారు silverjubilee\@iiit.ac.in మెయిల్ ఐడీకి పంపించాలని తెలిపారు.
అడ్వాన్స్ పన్ను వసూళ్లలో 15 శాతం వృద్ధి
న్యూఢిల్లీ, జూన్ 17: బ్యాంక్లు, ఆటోమొబైల్ కంపెనీలు, పెట్రో మార్కెటింగ్ సంస్థల చెల్లింపులు పెరగడంతో ఈ జూన్ త్రైమాసికంలో అడ్వాన్సు పన్ను వసూళ్లు 15 శాతం వృద్ధిచెంది రూ.1.16 లక్షల కోట్లకు చేరాయి. కంపెనీలు, భాగస్వామ్య సంస్థలు, వ్యక్తులు తొలి విడత అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లింపులకు జూన్ 15 చివరితేదీ. తాజా వసూళ్లలో కార్పొరేట్లు చెల్లించినవి రూ.92,173 కోట్లు ఉన్నాయి. వ్యక్తిగత ఆదాయపు పన్ను అడ్వాన్స్ చెల్లింపులు రూ.23,513 కోట్లకు చేరాయి. కార్పొరేట్ పన్ను చెల్లింపులు 17 శాతం, వ్యక్తిగత చెల్లింపులు 6 శాతం చొప్పున వృద్ధిచెందాయి.